హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): వ్యవసాయాన్ని పండుగ చేసి, రైతుల బతుకులు బాగు చేయడమే ప్రధాన ఎజెండాగా సీఎం కేసీఆర్ రైతు కేంద్రీకృత పథకాలకు ప్రాణంపోశారు. మొదటగా ప్రధాన సమస్యలైన విద్యుత్తు, సాగునీటి కష్టాలను తీర్చారు. 24 గంటల నాణ్యమైన విద్యుత్తును, కాళేశ్వరం ద్వారా సాగునీరును అందించారు. ఆ తర్వాత రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, రైతువేదికలు, కల్లాల నిర్మాణంతో పాటు అనేక పథకాలను అమలు చేసి, లక్షల మంది రైతాంగానికి అండగా నిలిచారు. ఈ ఏండేండ్ల కాలంలో పలు పథకాల ద్వారా ప్రభుత్వం రైతులకు నేరుగా సుమారు రూ. 64 వేల కోట్లు అందజేయడం గమనార్హం. ధాన్యం కొనుగోలు విలువతో కలిపితే ఇది సుమారు రూ. 1.50 లక్షల కోట్లు కానున్నది.