కేంద్రం తీరుపై టీఆర్ఎస్ నిరసనలు
అన్నదాత కోసం రోడ్డెక్కిన గులాబీ దళం
జాతీయ రహదారులపై రాస్తారోకోలు
చి‘వరి’ వరకూ పోరాటం ఆపేది లేదని హెచ్చరిక
‘తెలంగాణ రైతులు.. ప్రజలు.. మంత్రులంటే మీకు అంత చులకనా? పక్క రాష్ర్టాల్లో కొన్నట్లుగానే ఇక్కడ పండిన ధాన్యాన్ని ఎందుకు కొనుగోలు చేయరు?’ అంటూ గులాబీ దండు నినదించింది. ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం తీరును నిరిసిస్తూ ఆందోళనలకు దిగింది. జాతీయ రహదారులపై రాస్తారోకోలు చేపట్టింది. మోదీ డౌన్డౌన్.. కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సిందే. ధాన్యం మొత్తం కొనుగోలు చేయాల్సిందేనని నినదించింది. గ్రేటర్ పరిధిలోని జాతీయ రహదారులపై బుధవారం ధర్నాలు, రాస్తారోకోలు చేపట్టి కేంద్ర ప్రభుత్వ తీరును తూర్పారబట్టింది.
“రతనాల రాశుల్లో రాజోలె తిరిగిన రైతన్న.. బూజు బట్టిండో ఇయ్యాల.. బాజారు పాలయ్యిండో ఉయ్యాల
మెరుపు నాట్యానికి, ఉరుము పాటకు జడిసి ఉరికురికి చేను కోసి.. ముత్యాల గింజల్ని కళ్లతో ముద్దాడి.. కల్లంలో రాశి పోసి సావుకారి బాకి సంచులల్లో నింపి.. మిగిలిన తన వడ్ల బండ్లు ఇంటికి పంపికమ్మని కలలు కన్నోడె ఆయెల్ల
చమురు ఇంకిన ఈ బతుకు దీపాలను.. సర్కారు తీరు ఎక్కిరిస్తా ఉంటే.. దానాలుజేసిన ధర్మరాజు రైతు.. దీనంగ చేయిజాపిండో ఉయ్యాల.. దుఃఖంతో బోరుమంటుండే ఇయ్యాల..
రతనాల రాశుల్లో రాజోలె తిరిగిన రైతన్న… బూజు బట్టిండో ఇయ్యాల.. బాజారు పాలయ్యిండో ఉయ్యాల”
‘తెలంగాణలో వరే సాగు చేయండి. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ధాన్యం మొత్తం కేంద్రం కొనుగోలు చేసేలా మేం చూస్తాం” అంటాడు ఒకాయన..
‘తెలంగాణ మంత్రులకు పనేం లేదా? ధాన్యం కోసం ఢిల్లీకి ఎందుకొస్తున్నరు?. మేం ఉప్పుడు బియ్యం కొనం. మీ జనాలకు నూకలు తినుడు అలవాటు చేయించండి’ అని అంటాడు ఇంకో ఆయన.
ధాన్యం పండిస్తే.. నూకలు తినమంటారా?
ప్రభుత్వ విప్ అరెకపూడి గాంధీ
నిరంకుశ వైఖరికి నిరసనగా.. కేంద్రం దిష్టిబొమ్మ దహనం
కదం తొక్కిన గులాబీ శ్రేణులు
మియాపూర్ , ఏప్రిల్ 6: తెలంగాణలో రైతులు ఆరుగాలం శ్రమించి ధాన్యం పండిస్తే ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా ప్రజల్ని నూకలు తినమనడం ఎంత వరకు సబబని ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర వైఖరికి నిరసనగా మియాపూర్ చౌరస్తాలో రాస్తారోకో, మహాధర్నా చేపట్టి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా విప్ గాంధీ మాట్లాడుతూ, తెలంగాణలో సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మారుస్తుంటే… కేంద్రం మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ధాన్యం కొనుగోళ్లు చేయకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నదన్నారు. రైతులు పండించిన ధాన్యం కొనటం భిక్ష కాదని, ఇది హక్కన్నారు. రైతు వ్యతిరేక విధానాలతో కేంద్రం నానాటికీ మొండిగా వ్యవహరిస్తున్నదని, ఇలాంటి నియంత కేంద్రం మెడలు వంచే దాకా… రైతులు పండించిన ధాన్యం కొనుగోలు చేసే వరకు పోరాటాలు కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్రంలోని బీజేపీ నేతలకు తెలంగాణ రైతుల కష్టాలు ఎందుకు కనపడటం లేదని గాంధీ ప్రశ్నించారు. ప్రాజెక్టులతో జలకళ సంతరించుకున్న తెలంగాణను చూసి ఓర్వలేకే బీజేపీ డ్రామాలాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్, రాగం నాగేందర్యాదవ్, జగదీశ్వర్గౌడ్, నార్నె శ్రీనివాసరావు, మాధవరం రోజాదేవిరంగారావు, మంజులరఘునాథ్రెడ్డి, మాజీ కార్పొరేటర్ సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
కేంద్రానిది ద్వంద్వ నీతి
బెంగళూరు జాతీయ రహదారిపై ఆందోళన
చార్మినార్, ఏప్రిల్ 6 : ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం ద్వంద్వ విధానాలను అవలంభిస్తోందని టీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ సర్కారు తీరుకు నిరసనగా బుధవారం ఓల్డ్ సిటీలోని బెంగళూరు జాతీయ రహదారిపై చార్మినార్ నియోజకవర్గ నాయకులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యాసంగి వరి ధాన్యం మొత్తం కొనుగోలు చేసే వరకు టీఆర్ఎస్ ఆందోళనలు విరమించబోదన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల రైతుల జీవితాలు అగమ్యగోచరంగా తయారయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ రాస్తారోకోతో సుమారు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకుడు దిపాంకర్పాల్, మహిళా అధ్యక్షురాలు మందిరా నస్గర్, మూన్సా తదితరులు పాల్గొన్నారు.
రైతుపై కక్ష.. కొనుగోళ్లలో వివక్ష
కేంద్ర ప్రభుత్వ వైఖరి మారాలి
రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్
శంషాబాద్-బెంగళూరు జాతీయ రహదారిపై నిరసన
మణికొండ, ఏప్రిల్ 6: రైతుపై కక్ష పెంచుకున్న కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లపై వివిక్ష చూపిస్తున్నదని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ ధ్వజమెత్తారు. మోదీ సర్కారు వైఖరిని నిరసిస్తూ రాజేంద్రనగర్ నియోజకవర్గ వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు రైతులకు మద్దతుగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టాయి. శంషాబాద్-బెంగళూరు ప్రధాన రహదారిపై నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం వడ్ల కొనుగోలుపై పూటకో మాట మాట్లాడుతూ తప్పుదోవ పట్టిస్తున్నదన్నారు. రైతు వ్యతిరేకి బీజేపీని ప్రజలు సహించబోరని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మణికొండ మున్సిపాలిటీ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ కె.రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీపీ మల్లేశ్, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు బి.శ్రీరాములు, నాయకులు శ్రీకాంత్, కుమార్, తదితరులు పాల్గొన్నారు.
కేంద్రం తీరు మారాలి
ధాన్యం మొత్తం కొనుగోలు చేయాలి
ఎమ్మెల్యేలు సుధీర్రెడ్డి, కిషన్రెడ్డి, ఎమ్మెల్సీ దయానంద్
పెద్దఅంబర్పేట్ జాతీయ రహదారిపై ఆందోళన
ఎల్బీనగర్, ఏప్రిల్ 6: తెలంగాణ ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం తీరు మారాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ చైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిరసనగా రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్పేట్ జాతీయ రహదారిపై నిర్వహించిన రాస్తారోకోలో ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తతో కలిసి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతుల పట్ల కేంద్ర ప్రభుత్వ వైఖరి మారే వరకు పోరాటం ఆపబోమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు జిట్టా రాజశేఖర్రెడ్డి, సాగర్రెడ్డి, ప్రవీణ్కుమార్, చెరుకు సంగీత ప్రశాంత్గౌడ్, రమావత్ పద్మానాయక్, ముద్రబోయిన శ్రీనివాస్రావు, సీనియర్ టీఆర్ఎస్ నాయకులు అనంతుల రాజారెడ్డి, కటికరెడ్డి అరవింద్రెడ్డి, బిచినేపల్లి వెంకటేశ్వర్రావు, చింతల రవికుమార్ గుప్త, నల్ల రఘుమారెడ్డి, తూర్పాటి చిరంజివి, సుర్వీ రాజు, సత్యంచారి, జక్కుల శ్రీశైలం యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కొనేవరకు పోరాటం ఆపేది లేదు
కేంద్రం వైఖరిని ప్రజల ముందు ఎండగడుతాం
ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి, డిప్యూటీ మేయర్ శ్రీలత
ఉప్పల్ రింగ్ రోడ్డును ముట్టడించిన గులాబీ శ్రేణులు
రామంతాపూర్, ఏప్రిల్ 6 : యాసంగి వరి ధాన్యం పూర్తిగా కొనే వరకు పోరాటం ఆపేది లేదని.. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని ప్రజల్లో ఎండగడుతామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఉప్పల్ రింగ్ రోడ్డులో వందలాది మంది టీఆర్ఎస్ కార్యకర్తలు, కార్పొరేటర్లతో కలిసి భారీ ధర్నా నిర్వహించి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తెలంగాణలో పండించిన ధాన్యం కొనుగోలు చేయాలని పదేపదే కోరినా కేంద్రం మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. పారా బాయిల్డ్ రైస్ పేరిట కొర్రీలు పెడుతూ రైతుల జీవితాలతో ఆటలాడుతున్న మోదీ సర్కారుకు బుద్ధి చెబుతామని హెచ్చరించారు. డిప్యూటీ మేయర్ శ్రీలతాశోభన్రెడ్డి మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటుంటే.. కేంద్ర ప్రభుత్వం మాత్రం కక్షపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి, స్వర్ణరాజు, బన్నాల గీతాప్రవీణ్, జెరిపోతుల ప్రభుదాసు, పన్నాల దేవేందర్రెడ్డి, శాంతి సాయిజెన్ శేఖర్, మాజీ మేయర్ బొంతు రామ్మోహన్తో పాటు.. బేతి సుమంత్రెడ్డి, మాజీ కార్పొరేటర్ గొల్లూరి అంజయ్య, డాక్టర్ బీవీచారి, గడ్డం రవికుమార్, పల్లె నర్సింగ్రావు, ధన్పాల్రెడ్డి పాల్గొన్నారు.
మొండి మాటల బండీ.. ఎక్కడున్నవు?
యాసంగి వరి ధాన్యం కొనితీరాల్సిందే
ఎమ్మెల్యే వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
కొంపల్లిలో జాతీయ రహదారిపై రాస్తారోకో
కుత్బుల్లాపూర్, ఏప్రిల్ 6: వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో బీజేపీ నాయకులు జిమ్మిక్కులు చేస్తున్నారని, మొండి మాటలతో తెలంగాణ రైతులను తప్పుదోవ పట్టిస్తున్న బండి సంజయ్ కేంద్రాన్ని ఒప్పించాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్, ఎమ్మెల్సీ, టీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు శంభీపూర్ రాజు అన్నారు. యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం కుత్బుల్లాపూర్ నియోజకవర్గం కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలో 44వ జాతీయ రహదారిపై టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి రాస్తారోకో చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా… నిత్యావసర సరుకుల ధరలు పెంచుతూ ప్రజలపై పెనుభారాన్ని మోపుతున్న బీజేపీకి పతనం తప్పదన్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను కేంద్రం కొనుగోలు చేయకుండా.. రైతుల సహనాన్ని పరీక్షిస్తుందన్నారు. తెలంగాణలో ఉద్యమాలు కొత్త కాదని, తిరగబడితే సాధించలేనిది ఏదీ లేదని వారు కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాస్తారోకో చేసిన ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులను పేట్బషీరాబాద్ పోలీసులు స్టేషన్కు తరలించి అనంతరం వదిలేశారు.