హైదరాబాద్ : కృష్ణా నది యాజమాన్య బోర్డుకు తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ గురువారం మరోసారి లేఖ రాశారు. తాగునీటి వినియోగం, లెక్కింపును లేఖలో ప్రస్తావించారు. తాగునీటి వినియోగాన్ని 20శాతంగానే పరగణించాలని బోర్డును కోరారు. బచావత్ ట్రైబ్యునల్ ప్రకారం 20 శాతంగా లెక్కించాలని, 15 శాతంగానే లెక్కించాలని ఇటీవల సీడబ్ల్యూసీ పేర్కొందన్నారు. కృష్ణాలో 75.32 టీఎంసీలు ఇవ్వాలని బ్రిజేష్ ట్రైబ్యునల్ను కోరుతున్నామని, 75.32 టీఎంసీల్లో 20 శాతాన్ని తాగునీటిగా లెక్కించాలన్నారు.
20 శాతం ప్రకారం 15.06 టీఎంసీలను తాగునీటిగా పరిగణించాలని లేఖలో ఈఎన్సీ విజ్ఞప్తి చేశారు. మరో వైపు జలసౌధలో కేంద్ర జలవనరుల శాఖ అదనపు కార్యదర్శి దేవశ్రీ ముఖర్జీతో కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీ చైర్మన్లు ఎంపీ సింగ్, చంద్రశేఖర్ అయ్యర్ సమావేశమయ్యారు. ఆయా బోర్డుల పరిధిలో గెజిట్ నోటిఫికేషన్ అమలును సమీక్షించారు. ఇరు రాష్ట్రాల నుంచి ఇప్పటి వరకు అందిన సమాచారం వివరించగా.. దేవశ్రీ జలశక్తి శాఖకు నివేదిక ఇవ్వనున్నారు.