హైదరాబాద్, మార్చి 18 (నమస్తే తెలంగాణ): తెలంగాణ బాల ఉద్యమకారిణి నీరుడు జయచంద్రికకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రూ.5 లక్షల ఆర్థిక సాయం చెక్కును అందజేశారు. జయచంద్రిక ఉన్నత విద్య కోసం దాత మనికొండ రంజిత్ ఆర్థిక సహాయం అందించేందుకు ముందుకొచ్చారు. శుక్రవారం హైదరాబాద్లోని కవిత నివాసంలో ఆ మొత్తాన్ని ఆమె చేతుల మీదుగా బాలికకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. తెలంగాణ తల్లి వేషధారణలో జయచంద్రిక ఉద్యమకారుల్లో స్ఫూర్తిని నింపిందని అభినందించారు. రాష్ట్రం రావాలని కలలుగన్న జయచంద్రిక వంటి ఎంతోమంది ఉద్యమకారులు, తెలంగాణ సమాజ ఆశయాలను టీఆర్ఎస్ ప్రభుత్వం నెరవేరుస్తున్నదని వెల్లడించారు. టీఆర్ఎస్ ప్రభుత్వ కృషితో రాష్ట్ర విద్యావ్యవస్థ పూర్తిగా మెరుగుపడిందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాలో, ప్రతి నియోజకవర్గంలో గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి విద్యావ్యవస్థను బలోపేతం చేసిందని, అన్ని స్థాయిల్లో అత్యున్నత విద్యా సౌకర్యాలు ఏర్పాటు చేసి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నదని చెప్పారు. విదేశాల్లో చదవాలన్న ఆసక్తి ఉన్న విద్యార్థులకు బీఆర్ అంబేద్కర్ ఓవర్సీస్ స్కాలర్షిప్స్, మహాత్మాజ్యోతిబాపూలే, వివేకానంద పేర్లతో రూ.20 లక్షల చొప్పున స్కాలర్షిప్ అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం విద్యను అందిస్తే విద్యార్థుల ఉన్నత భవిష్యత్తుకు బంగారు పునాదులు వేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. జయచంద్రిక చదువుకు తోడ్పాటును అందిస్తున్న రంజిత్ను కవిత ప్రత్యేకంగా అభినందించారు.కార్యక్రమంలో తెలంగాణ జాగృతి ఉపాధ్యక్షుడు రాజీవ్సాగర్ తదితరులు పాల్గొన్నారు.