తెలంగాణ అభివృద్ధి ప్రయాణం మొదలై ఏడేండ్లు గడిచాయి. స్వరాష్ట్రంగా ఏర్పడిన వెంటనే తెలంగాణ రేసింగ్ కార్ మాదిరిగా మారిపోయింది. ఒక్కసారిగా పికప్ అందుకొని అంతకంతకూ వేగం పెంచుకుంటూ పోతున్నది. కరోనా వంటి ప్రపంచ విపత్తును సైతం ఎదుర్కొని పాజిటివ్ వృద్ధిరేటును నమోదు చేసింది. ఈ అభివృద్ధి ప్రయాణాన్ని వివరిస్తూ రాష్ట్ర అర్థ గణాంక శాఖ తాజాగా ‘తెలంగాణ జర్నీ’ పేరుతో నివేదికను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ ఏర్పడకముందు రెండేండ్లలో పరిస్థితి.. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో గడిచిన ఏడేండ్లలో జరిగిన అభివృద్ధిని అంశాల వారీగా వివరించింది. తెలంగాణ ఏర్పడటానికి రెండేండ్ల ముందు (2012-14) దాదాపు అన్ని రంగాల్లో జాతీయ సగటుకన్నా తక్కువగా ఉండేదని, 2014-15లోనే దానిని అధిగమించిందని వెల్లడించింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎక్కడా పరుగు ఆగలేదని వెల్లడించింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ)
సొంత పన్ను రాబడుల పెరుగుదలలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 2014-15తో పోల్చితే సొంత రాబడులు 90 శాతం పెరిగాయి. 2014-15లో పన్ను వసూళ్లు రూ.35,146 కోట్లు ఉండగా, 2020-21 నాటికి రూ.66,648 కోట్లకు పెరిగాయి. సొంత రాబడుల్లో వార్షిక సగటు వృద్ధి 11.52 శాతంగా నమోదైంది.
మైనస్ నుంచి అందనంత ఎత్తుకు..
స్వరాష్ట్రం ఏర్పడకముందు తెలంగాణ ప్రాంత జీఎస్డీపీ జాతీయ సగటుతో పోల్చితే 1.3 శాతం తక్కువగా ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటి సంవత్సరంలోనే జాతీయ సగటును మించి ఒక శాతం అధికంగా వృద్ధిని నమోదు చేసింది. ఆ తర్వాత ఏనాడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఏటికేడు తన విలువను పెంచుకుంటూ కరోనా వచ్చే నాటికి ఏకంగా 5 శాతం అధిక వృద్ధిని నమోదు చేసింది. కరోనా విపత్తులో జాతీయ వృద్ధి-3.0గా నమోదైతే, తెలంగాణ +2.4 వృద్ధిని సాధించడం విశేషం.
వ్యవసాయ అనుబంధ రంగాల్లో తెలంగాణ కనీవినీ ఎరుగని అభివృద్ధి సాధించింది. రాష్ట్రం ఏర్పడేనాటికి 2014-15లో వ్యవసాయ, అనుబంధ రంగాల వృద్ధిరేటు -0.7 శాతం. ఇది 2019-20 నాటికి ఏకంగా 35.9 శాతానికి పెరిగి యావత్ దేశాన్ని ఆశ్చర్యపరిచింది. కరోనా విపత్తులోనూ 2020-21లో 18.5 శాతం వృద్ధిని నమోదుచేసింది. రాష్ట్ర జనాభాలో 55 శాతం మందికి ఉపాధి కల్పించేస్థాయికి ఎదిగింది. మాంసం ఉత్పత్తిలోనూ మూడు రెట్లకుపైగా వృద్ధి నమోదు చేసింది. ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మించి సాగునీరు అందించటం, రైతుబంధు, రైతుబీమావంటి పథకాలు
ప్రవేశపెట్టడం, పండిన ప్రతిగింజను కొనుగోలు చేయడం, గొర్రెల పంపిణీ వంటి చర్యల ఫలితంగా ఇది సాధ్యమైంది.
వ్యవసాయరంగ ఉత్పత్తుల స్థూల విలువ
2014-15 9,528
2020-21 47,440
వృద్ధి ఐదు రెట్లు
మాంసం ఉత్పత్తుల స్థూల విలువ
ప్రస్తుత ధరల్లో. రూ. కోట్లలో
2014-15 8,310
2020-21 26,111
వృద్ధి 3.14
తలసరి ఆదాయ వృద్ధిలోనూ..
2012-14 మధ్య తెలంగాణ ప్రాంత తలసరి ఆదాయం వృద్ధిరేటు రెండేండ్లలో సగటున 10.9 శాతం నమోదు చేసింది. ఇది జాతీయ వృద్ధిరేటు కన్నా 0.7 శాతం తక్కువ. తెలంగాణ ఏర్పడిన మొదటి సంవత్సరమే జాతీయ వృద్ధిరేటును దాటేశాం. దేశ సగటు కన్నా తెలంగాణ 1.1 శాతం అధిక వృద్ధిని నమోదుచేసింది. అప్పటి నుంచి ఏటా మరింత మెరుగుపడుతూ ప్రస్తుతం ఏకంగా 5.8 శాతం అధిక వృద్ధిలో నిలిచాం. 2014-15లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1.24 లక్షలు ఉండగా, ఏడేండ్లలో దాదాపు రెట్టింపై రూ.2.37 లక్షలకు చేరింది. అదే సమయంలో జాతీయ సగటు రూ.86,647 నుంచి రూ.1.28 లక్షలకు పెరిగింది. రాష్ట్రం ఏర్పడేటానికి తలసరి ఆదాయంలో 11వ స్థానంలో ఉన్న తెలంగాణ, 2020-21 నాటికి మూడో స్థానానికి ఎగబాకడం విశేషం.
సేవారంగం డబుల్
2014-15తో పోల్చితే ఏడేండ్లలో సేవారంగం విలువ దాదాపు రెట్టింపయ్యింది. ముఖ్యంగా ఐటీ రంగంలో అనూహ్య వృద్ధి సాధించింది. 2014-15లో రూ.66,276 కోట్లుగా ఉన్న ఐటీ ఎగుమతులు,2020-21 నాటికి ఏకంగా రూ.1.45 లక్షల కోట్లకు పెరిగాయి.
దక్షిణాదిలో టాప్
దేశ జీడీపీలో తెలంగాణ వాటా 2014-15లో 4.06 శాతం ఉండగా, 2020-21 నాటికి 4.97 శాతానికి పెరిగింది. జీడీపీలో మూడో అతిపెద్ద వాటాదారుగా రికార్డు సృష్టించింది. దక్షిణాది రాష్ర్టాల్లో సగటు వృద్ధిరేటులో తెలంగాణ మొదటి స్థానంలో నిలిచింది.
పారిశ్రామిక రంగ పరుగులు
టీఎస్ఐపాస్తో రాష్ట్రంలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతున్నది. 2014-15తో పోల్చితే ఏడేండ్లలో తయారీరంగం విలువ దాదాపు రెట్టింపయ్యింది. పారిశ్రామిక రంగం ఉత్పత్తుల స్థూల విలువ 60 శాతం వృద్ధి చెందింది. నిర్ణీత గడువులోగా అనుమతులు మంజూరు చేయకుంటే ఆటోమెటిక్గా అనుమతులు వచ్చే వ్యవస్థ దేశంలో తెలంగాణలో మాత్రమే ఉన్నది.
రాష్ట్ర ప్రగతిని గుర్తించి
కేంద్ర ప్రభుత్వం అనేక అవార్డులు అందజేసింది. అనేక నివేదికలు తెలంగాణ అభివృద్ధిని కీర్తించాయి.