హైదరాబాద్: వినాయక చవితి పర్వదినం సందర్భంగా హైదరాబాద్తోపాటు రాష్ట్రంలోని ప్రజలంతా మట్టి వినాయ విగ్రహాలను వినియోగించే విధంగా ప్రోత్సహించాలని అధికారులకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్ సూచించారు. సెప్టెంబర్లోలో జరిగే గణేశ్ నిమజ్జన ఏర్పాట్లపై బీఆర్కే భవన్లో సీఎస్ మంగళవారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి డీజీపీ ఎం. మహేందర్ రెడ్డి, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, అడిషనల్ డీజీ జితేందర్, హైదరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లు సీవీఆనంద్, మహేశ్ భగవత్, జీహెచ్ ఎంసీ కమీషనర్ లోకేశ్ కుమార్, కాలుష్య నియంత్రణ మండలి కార్యదర్శి నీతూ పప్రసాద్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా సీఎస్ మాట్లాడుతూ, నగరంలో కాలుష్య కారక గణేశ్ విగ్రహాలను ఉపయోగించవద్దని రాష్ట్ర హై కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో మట్టి వినాయకుల విగ్రహాలు వినియోగించే విధంగా నగర వాసులను చైతన్య పర్చాలని సూచించారు. ప్లాస్టర్ ఆఫ్ పారిస్, సింథటిక్ కలర్లు, పర్యావరణ హాని కారక కెమికల్స్లను విగ్రహాల తయారీలో నిషేధిస్తూ కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిందన్నారు. పీఓపీతో తయారు చేసిన విగ్రహాలను ట్యాంక్ బ్యాండ్ తోపాటు నగరంలోని ఇతర చెరువుల్లో కూడా నిమజ్జనం చేయవద్దనే ఆదేశాలున్నాయన్నారు. ఈ అంశాలపై విగ్రహ తయారీదారులను చైతన్య పర్చాలని సూచించారు. నగరంలో మట్టి వినాయకుల తయారీదార్లను ప్రోత్సహించడంతోపాటు మట్టి విగ్రహాల మార్కెటింగ్కు తగిన ప్రోత్సాహం ఇవ్వాలని ఆయన అధికారులకు సూచించారు. హై కోర్టు, సుప్రీం కోర్టు ఆదేశాలను పాటించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.