అభివృద్ధి పథంలో దూసుకెళ్తున్న తెలంగాణ జాతికి మార్గనిర్దేశనం చేస్తూ ముందుకు సాగుతున్నది. అదే సమయంలో బీజేపీ ఏలుబడిలో ఉన్న దేశం వెనుకబడుతున్నది. అభివృద్ధి, సంక్షేమంలో సంక్షోభం నెలకొన్నది. ఉపాధి కల్పన అడుగంటుతున్నది. మోదీ నాయకత్వంలో సకల రంగాల్లో స్తబ్ధత ఏర్పడింది. ఈ క్రమంలో యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తున్నది. సవాళ్లు ఎన్నున్నా.. రాష్ట్రం ప్రగతి సాధిస్తుండడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతున్నది. ఈ తరుణంలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనాదక్షతపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన జాతీయ రాజకీయాల్లోకి రావాలని, దేశానికి నాయకత్వం వహించాలనే డిమాండ్లు ఊపందుకుంటున్నాయి. ఆరు దశాబ్దాల స్వరాష్ట్ర కాంక్షను తన పోరాటంతో సాకారం చేసిన నాయకుడు జాతిని సమర్థవంతంగా నడిపిస్తారన్న నమ్మకం ప్రజల్లో బలపడుతున్నది. అందుకే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలన్న ఆకాంక్ష సబ్బండ వర్గాల నుంచి వినిపిస్తున్నది.
ఇంట గెలిచి.. రచ్చ గెలవాలని అనేది సామెత… మన ముఖ్యమంత్రి రాష్ట్రం కోసం పోరాటం చేసి ఇంట గెలిచి చూపించారు. రైతురాజ్య స్థాపన కోసం దేశాన్ని ఏకం చేసి విజయం సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు. ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ.. ఉపాధి కల్పనకు పెద్దపీట వేస్తూ దేశ వ్యాప్తంగా ప్రజల మన్ననలు పొందుతున్నారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో అడుగుపెట్టాలని మన రాష్ట్రంతో పాటు అన్ని రాష్ర్టాల ప్రజలు ఆయనకు బాసటగా నిలుస్తున్నారు. రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు తమకూ కావాలని దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి డిమాండ్ వస్తున్నది. కేంద్రంలో అధికారంలో ఉన్న రాజకీయ పార్టీలు వారి సొంత లాభం కోసం పని చేస్తున్నాయి. మత విద్వేషాలను రెచ్చగొట్టి అధికారం కోసం పాకులాడుతున్నాయి. మన నాయకుడు కేవలం ప్రజల సంక్షేమం, రాష్ర్టాభివృద్ధి కోసం పరితపిస్తున్నాడు. దీన్ని ఓర్వలేకనే కేంద్ర ప్రభుత్వం లేనిపోని ఆంక్షలు పెట్టి అభివృద్ధిని అడ్డుకుంటున్నది. విజన్ ఉన్న నాయకుడు సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి రావాలని అందరూ కోరుకుంటున్నారు.
కేసీఆర్ రాకతో పెను మార్పు..
పట్టుదల ఉన్న నాయకుడు సాధించలేనిది ఉండదు. మన ముఖ్యమంత్రి కేసీఆర్కు ఉన్నంత పట్టుదల దేశంలో ఎవరికీ లేదు. ఆందుకే ఆయన దేశంలోని అన్ని పార్టీల నాయకులను మెప్పించి రాష్ట్రం వచ్చే వరకు పోరాటం చేశారు. అభివృద్ధి, సంక్షేమంలోనూ ఆయన పనితీరు అలాగే ఉంటది. అందుకే దేశ రాజకీయాల్లో ఆయనతోనే పెనుమార్పు వస్తుంది.
– నాగరాజు, అధ్యక్షుడు, ఫీల్డ్ అసిస్టెంట్ల సంఘం, కామారెడ్డి జిల్లా
ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి..
సీఎం కేసీఆర్ విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టి రాష్ర్టాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో వ్యవసాయం పండుగలా మారింది. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి వెళ్తే ప్రపంచానికే దేశం అన్నదాతగా నిలుస్తుంది. ఉచిత విద్యుత్, సాగు నీరు, మద్దతు ధర, రైతు పెట్టుబడి, రైతు బీమా అన్ని పథకాలు దేశంలోని రైతులకు అందుతాయి.
-ఇంద్రజిత్, చద్మల్, గాంధారి.
కేసీఆర్ ప్రధాని అయితేనే అందరికీ న్యాయం ..
సామాన్య రైతులు తెలంగాణలో తలెత్తుకొని జీవిస్తున్నట్లు దేశంలోని అందరు అన్నదాతలు జీవించాలంటే కేసీఆర్ ప్రధాని కావాలి. రైతులకు ఎలా న్యాయం చేయాలి అనే విషయంలో కేసీఆర్కు ఉన్నంత స్పష్టత ఎవరికీ లేదు. అందుకే మన రాష్ట్రంలో రైతులకు అమలు చేస్తున్న పథకాలు దేశంలో ఎక్కడా కనిపించవు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో రావడాన్ని ప్రతి ఒక్కరూ హర్షిస్తారు.
-బండి రజిత, రామారెడ్డి.
ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి
ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తి కేసీఆర్ సారు…అందుకే ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని ఎదిరించడానికి అలుపెరుగని పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించారు. ఇప్పుడు దేశ పరిపాలనలో జరుగుతున్న అన్యాయాలను ఎదుర్కోవడానికి ఆయన నడుం బిగించాలి. ఆయన పోరాటం సరికొత్త మలుపునకు నాంది పలుకుతుంది.
-మోతీరాం, దుర్గం, గాంధారి.
దేశంలో బలమైన శక్తి సీఎం కేసీఆర్..
కొత్తగా ఏర్పడిన రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చే శక్తి కేవలం ఒక్క కేసీఆర్కు మాత్రమే ఉంది. ఆయన ఉద్యమంలో ఎలా పని చేశారో ఇప్పుడు బంగారు తెలంగాణ కోసం అలాగే పని చేస్తున్నారు. దేశానికి ప్రధాని కావాలి ఆయన, అయితేనే ప్రపంచంలో మన దేశం బలమైన శక్తిగా మారుతుంది.
-శ్రీనివాస్, ధర్మారెడ్డి.
దేశానికి రోల్ మోడల్..
ఉద్యమం నుంచి అధికారం చేపట్టిన తొలి రాజకీయ నాయకుడు కేసీఆర్. సాదకబాధకాలు తెలిసిన నాయకుడు. రైతుల కోసం ఏదైనా చేయగలడు. అందుకే ఆయన దేశ రాజకీయాల్లోకి వస్తే రోల్ మోడల్గా నిలుస్తారు. ఆయన నాయకత్వంలో రైతులకు న్యాయం జరుగుతుంది. దేశమంతా కేసీఆర్ నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నది.
-చిరంజీవి, బ్రాహ్మణపల్లి, తాడ్వాయి.
దేశానికి కేసీఆర్
నాయకత్వం అవసరం…
ప్రస్తుత పరిస్థితుల్లో దేశానికి మంచి నాయకత్వం అవసరం. కేసీఆర్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుంది. ఉపాధి హామీలో క్షేత్ర సహాయకులుగా పని చేస్తున్న మమ్మల్ని విధుల్లో నుంచి తొలగించినా మా సమస్యలను విని మళ్లీ మంచి నిర్ణయం తీసుకున్నారు. దేశంలో యువకులు, రైతులకు న్యాయం చేయగల ఏకైక నాయకుడు కేసీఆర్ ఒక్కరే.
-శంకర్, ఎండ్రియాల్, తాడ్వాయి.
అందరి కుటుంబాలు బాగుపడుతాయి..
దేశంలోని ప్రతి కు టుంబం బాగుపడాలంటే కేసీఆర్ దేశ ప్రధాని కావాలి. స్వరాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందుతున్నాయి. మన నాయకుడు దేశ రాజకీయాల్లోకి అడుగుపెడితే అధికారం చేపట్టడం ఖాయం. అప్పుడు దేశం మొత్తం అభివృద్ధిలో పరుగులు పెడుతుంది.
– సంతోష్, దేవాయిపల్లి, తాడ్వాయి.
యువతకు మంచి అవకాశాలు..
యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావాలంటే సీఎం కేసీఆర్ ప్రధాని కావాలి. ఆయన మార్గదర్శకంలో పరిశ్రమలు ఏర్పాటుతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో కులం, మతం వంటి అంశాల కన్నా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పని చేసే నిరంతర శ్రమ జీవి కావాలి. రాత్రి పగలు అనే తేడా లేకుండా ప్రజల గురించి ఆలోచించే కేసీఆర్ నాయకత్వంలో దేశం అభివృద్ధి బాటలో పయనిస్తుందనడంలో సందేహం లేదు.
– సాయి కుమార్, గాంధారి.