హైదరాబాద్: రాష్ట్ర మంత్రివర్గం మరికొద్ది సేపట్లో సమావేశం కానుంది. మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. ఈ సమావేశంలో కరోనా వైరస్ వ్యాప్తి నిరోధానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించనున్నారు. కేసుల సంఖ్య, దవాఖానల్లో ఉన్న వసతులు, ఆక్సిజన్, ఔషధాల లభ్యత, వ్యాక్సినేషన్ ప్రక్రియ తదితర అంశాలపై సమగ్రంగా చర్చించే అవకాశం ఉన్నది.
కరోనాతోపాటు ప్రధానంగా రాష్ట్రంలో వ్యవసాయంపై కూడా మంత్రివర్గం చర్చించనున్నది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రం పేచీలు, ఎరువుల ధరల అంశం ప్రస్తావనకు రానున్నది. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో రాష్ట్ర ఎంపీలు అనుసరించాల్సిన వైఖరిపై కూడా మంత్రివర్గం చర్చించవచ్చు. వచ్చే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి ఎక్కువ నిధులు తెచ్చేందుకు కృషి చేయడంతోపాటు పలు పెండింగ్ ప్రాజెక్టుల సాధనకు అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం.
నూతన జోనల్ వ్యవస్థ ప్రకారం జిల్లాల, జోన్ల కేటాయింపులు పూర్తయిన నేపథ్యంలో వచ్చిన అప్పీళ్లు, స్పౌజ్ కేసులు, ఉద్యోగాల ఖాళీలు, నోటిఫికేషన్ల ప్రక్రియ తదితర అంశాలపై కూడా ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉన్నది.