హైదరాబాద్ : తెలంగాణ కేబినెట్ సమావేశం ముగిసింది. ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో సమావేశం దాదాపు ఆరుగంటల పాటు జరిగింది. ఈ సందర్భంగా పలుశాఖలు, అంశాలపై చర్చించారు. వైద్యారోగ్య శాఖ, రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, హోంశాఖ, వ్యవసాయశాఖ, పౌరసరఫరాల శాఖలు, అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగింది. పలు కీలక నిర్ణయాలకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది. సమావేశం ప్రారంభంలో అసెంబ్లీ సమావేశాలపై చర్చించారు. ఈ నెల 24 నుంచి శాసన సభ, మండలి సమావేశాల నిర్వహించేందుకు మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
హైదరాబాద్ లో నాలుగు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల నిర్మాణ ఏర్పాటుపై కేబినెట్ సమీక్షించింది. దవాఖానాల నిర్మాణ ఏర్పాట్లపై సత్వరమే చర్యలు చేపట్టాలని, అత్యంత వేగంగా ఆసుపత్రుల నిర్మాణం జరగాలని రోడ్లు భవనాల శాఖను కేబినెట్ ఆదేశించింది. గతంలో 130 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి సామర్థ్యం మాత్రమే ఉండేదని, దాన్ని ఇప్పటికే 280 మెట్రిక్ టన్నులకు పెంచుకున్నామని, దీన్ని మరింత పెంచి 550 మెట్రిక్ టన్నులకు చేరుకునేలా చర్యలు చేపట్టాలని వైద్యశాఖాధికారులను కేబినెట్ ఆదేశించింది.
రాష్ట్రంలో పూర్తి స్థాయిలో ఆరోగ్య మౌలిక వసతుల పురోభివృధ్ది కొరకు సమగ్రమైన ప్రణాళికలను సిద్ధం చేసుకుని తదుపరి కేబినెట్ ముందుకు తీసుకురావాలని మంత్రిమండలి వైద్య, ఆరోగ్యశాఖను ఆదేశించింది. అలాగే కొత్త మెడికల్ కాలేజీలు వచ్చే సంవత్సరం నుండి ప్రారంభించడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని ఆర్అండ్బీ, వైద్యారోగ్య శాఖలను ఆదేశాలిచ్చింది.
రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై కేబినెట్ చర్చించింది. ఒరుగుపొరుగు రాష్ట్రాలల్లో కరోనా పరిస్థితి, నియంత్రణకు సంబంధించిన సమాచారాన్ని సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు.
విద్యాసంస్థలు పునః ప్రారంభమైన అనంతర పరిస్థితులను కేబినెట్కు వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు వివరించారు. రాష్ట్రంలో విద్యా సంస్థలు తెరిచినా కేసుల్లో పెరుగుదల లేదని అధికారులు కేబినెట్కు తెలిపారు. మహమ్మారి పూర్తిగా అదుపులోనే ఉందని చెప్పారు. అన్నిరకాల మందులు, ఆక్సిజన్, టెస్ట్ కిట్స్, వాక్సినేషన్ అందుబాటులో ఉన్నాయని వివరించారు.
ఇప్పటి వరకు రాష్ట్రంలో ఇప్పటి వరకు 2.56కోట్లకుపైగా టీకా మోతాదులు పంపిణీ చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. ఇవాళ్టి నుంచి వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ ప్రారంభించినట్లు తెలిపారు. చిన్నపిల్లలకు కరోనా వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు కేబినెట్కు చెప్పారు. ప్రత్యేకంగా చిన్నపిల్లల వైద్యం కొరకు రూ.133 కోట్ల ఖర్చుతో 5,200 బెడ్లు, మందులు తదితర సామగ్రిని, ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఇప్పటికే సమకూర్చుకున్నామని వైద్యాధికారులు తెలిపారు.
కేబినెట్లో హోంశాఖపై మంత్రిమండలి చర్చించింది. ఈ సందర్భంగా కొత్త జిల్లాల్లో పోలీస్ సేష్టన్ల సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశారు. హోంమంత్రి మహముద్ అలీ నేతృత్వంలో ఏర్పాటైన ఉప సంఘంలో సభ్యులుగా హరీశ్రావు, జగదీశ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఇంద్రకరణ్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్ సభ్యులుగా ఉన్నారు. కొత్త జిల్లాల్లోని పోలీసు స్టేషన్ల సమస్యలపై కేబినెట్ సబ్ కమిటీ చర్చించి, నివేదికను రూపొందించనుంది. అలాగే వ్యవసాయశాఖ, పౌరసరఫరాల శాఖపై మంత్రులు చర్చించారు. వర్షాపాతం వివరాలు, వానాకాలం సాగు వివరాలను, పంట దిగుబడి అంచనా, వానాకాలంలో పంటల కొనుగోలు, మార్కెటింగ్ శాఖ సన్నద్ధతపై కేబినెట్ చర్చించింది. పొడు భూముల సమస్యలపై మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్ చైర్పర్సన్గా, సభ్యులుగా జగదీశ్రెడ్డి, పువ్వాడ అజయ్కుమార్ కొనసాగనున్నారు. అలాగే ధరణి పోర్టల్లో సమస్యల పరిష్కారానికి సైతం కేబినెట్ సబ్ కమిటీని నియమించారు. మంత్రులు హరీశ్రావు, ప్రశాంత్రెడ్డి, తలసాని శ్రీనివాస్యాదవ్, జగదీశ్రెడ్డి, నిరంజన్రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి సభ్యులు కొనసాగనున్నారు.
సమావేశంలో మద్యం దుకాణాల్లో గౌడ, ఎస్సీ, ఎస్టీ కులస్తులకు కేబినెట్ రిజర్వేషన్లు కల్పిస్తూ నిర్ణయం తీసుకున్నది. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మద్యం దుకాణాల్లో గౌడ కులస్తులకు 5శాతం, ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 5 శాతం రిజర్వేషన్లు కేటాయించింది. ఈ సందర్భంగా రోడ్ల మరమ్మతులకు సైతం మంత్రివర్గం నిధులు కేటాయించింది. ఇప్పటికే కేటాయించిన రూ.300కోట్లకు అదనంగా రూ.100 కేటాయిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నిధులు కేటాయిస్తూ పంచాయతీరాజ్ శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అలాగే హైదరాబాద్ నారాయణగూడలోని బాలికల వసతి గృహానికి 1,261 గజాల స్థలాన్ని కేటాయిస్తూ మంత్రిమండలి నిర్ణయించింది. రాజబహద్దూర్ వెంకటరామిరెడ్డి ఎడ్యుకేషనల్ సొసైటీ విజ్ఞప్తి మేరకు నిర్ణయం తీసుకున్నది.
సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. సంగారెడ్డి, ఆంధోల్, జహీరాబాద్, నారాయణ్ ఖేడ్ నియోజకవర్గాల్లో 4.56 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే సంగమేశ్వర, బసవేశ్వర ఎత్తిపోతల పథకాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. సంగమేశ్వర ఎత్తిపోతల పథకానికి సింగూరు జలాశయం కుడి వైపు నుంచి 12 టీఎంసీల నీటిని ఎత్తిపోసి జహీరాబాద్, ఆంధోల్, సంగారెడ్డి నియోజకవర్గాల్లో 2.19 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని ప్రతిపాదించింది. పథకం ద్వారా ఈ నియోజకవర్గాల్లోని 11 మండలాల్లో 231 గ్రామాలకు సాగునీరు అందనున్నది. ప్రాజెక్టుకు రూ.2,653 కోట్ల పరిపాలన అనుమతికి మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
బసవేశ్వర ఎత్తిపోతల పథకానికి సింగూరు జలాశయం ఎడమ వైపు నుంచి 8 టీఎంసీల నీటిని ఎత్తిపోసి నారాయణ్ ఖేడ్, ఆంధోల్ నియోజకవర్గాల్లో 1.65 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని కేబినెట్ ప్రతిపాదించింది. పథకం ద్వారా ఆయా నియోజకవర్గాల్లోని 8 మండలాల్లో 166 గ్రామాలకు సాగునీరు అందుతుంది. ప్రాజెక్టుకు రూ.1,774 కోట్ల పరిపాలన అనుమతికి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రెండు ఎత్తిపోతల పథకాలకు నాబార్డు ద్వారా రుణాలు పొందడానికి కూడా మంత్రివర్గం సాగునీటి శాఖకు అనుమతి ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ 15,16లో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లాలో నిర్మాణమవుతున్న నృసింహసాగర్ (బస్వాపూర్ జలాశయం) నాబార్డు ద్వారా రూ.2051.14 కోట్ల రుణం పొందడానికి మంత్రి వర్గం ఆమోదం తెలిపింది.