హైదరాబాద్ : రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై కేబినెట్ సమావేశంలో సమగ్రమైన చర్చ జరిగింది. ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్ అధ్యక్షతన దాదాపు 5 గంటలకు పైగా ఈ సమావేశం కొనసాగింది. కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం యొక్క ఆదాయంలో 15.3 శాతం వృద్ధిరేటు నమోదైనట్లు అధికారులు సీఎంకు వివరించారు. అయితే, కేంద్రం ప్రభుత్వం నుంచి సీఎస్ఎస్, వివిధ పథకాల కింద రాష్ట్రానికి రావాల్సిన నిధులు మైనస్ -12.9 శాతం తగ్గినప్పటికీ ఈ వృద్ధి రేటును నమోదు చేయడం గమనార్హమని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.
ముఖ్యంగా కేంద్రం నిధులు విడుదల చేయడంలో ఎస్ఎన్ఏ అకౌంట్లు అనే కొత్త పద్ధతి తేవడం ద్వారా రాష్ట్రాలకిచ్చే నిధులలో తీవ్రమైన జాప్యం జరుగుతున్నది. అంతేకాకుండా ఎఫ్ఆర్బీఎం పరిమితులను సకాలంలో ఇవ్వకుండా పోవడం, పరిమితుల్లో కూడా కోతలు విధించడం జరిగింది. ఎఫ్ఆర్బీఎంలో కోతలు విధించకుండా ఉండి ఉంటే రాష్ట్రం యొక్క ఆదాయం మరింతగా పెరిగి, దాదాపు 22 శాతం వృద్ధిరేటు నమోదయ్యేదని అధికారులు తెలిపారు.
సీసీఎస్లో గత ఎనిమిదేండ్లలో రాష్ట్రానికి రూ. 47,312 కోట్లు నిధులు మాత్రమే వచ్చాయని ఆర్థికశాఖ వివరించింది. అయితే, గత నాలుగు సంవత్సరాల్లో ఒక్క రైతుబంధు పథకం కింద రైతులకు రూ. 58,024 కోట్ల పంట పెట్టుబడి సాయం అందించడం జరిగిందని ఆర్థికశాఖ అధికారులు కేబినెట్కు వివరించారు. గత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ.1 లక్ష 84 కోట్లు ఖర్చు చేయగా అందులో సీఎస్ఎస్ పథకాల కింద అందింది రూ.5200 కోట్లు మాత్రమే. అంటే మొత్తం రాష్ట్రం పెట్టిన ఖర్చులో 3శాతం కంటే తక్కువ మాత్రమే కేంద్ర పథకాల కింద నిధులు అందాయని అధికారులు తెలిపారు.
కేంద్రం అవలంభిస్తున్న అసంబద్ధ విధానాల వల్ల రాష్ట్రాల వృద్ధి రేటు కుంటుపడుతుందని, రాష్ట్రం సాధించిన ప్రగతి కేంద్ర ప్రభుత్వం కూడా సాధించి ఉంటే, రాష్ట్ర జీఎస్డీపీ మరో రూ. 3 లక్షల కోట్లు పెరిగి, రూ. 14.50 లక్షల కోట్లకు చేరుకునేదని సీఎం కేసీఆర్ అభిప్రాయపడ్డారు. దేశ జనాభాలో మన రాష్ట్ర జనాభా రెండున్నర శాతమే అయినప్పటికీ, దేశ ఆదాయానికి 5 శాతం మనం కంట్రిబ్యూట్ చేయడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర స్వంత పన్నుల ఆదాయ వృద్ధిలో 11.5 శాతంతో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానంలో ఉందని అధికారులు కేబినెట్ కు వివరించారు.