హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ కృషితో కేవలం ఏడేండ్ల కాలంలోనే తెలంగాణ సస్యశ్యామలమైంది. ఒక్క ఎకరం పొలం పారినా చాలు అనుకునే స్థాయి నుంచి కోటి ఎకరాల అదనపు మాగాణం సాగుచేసే స్థాయికి తెలంగాణ రైతన్న ఎదిగాడు. తెలంగాణ గడ్డ దేశంలో అత్యధిక ధాన్యం పండించే స్థాయికి చేరుకొన్నది. ఒక్క ఏడాదిలోనే సుమారు 3 కోట్ల టన్నుల ధాన్యం పండించి తెలంగాణ తన సత్తా చాటింది. గత ఏడేండ్ల కాలంలో రైతుల నుంచి సుమారు రూ.84 వేల కోట్ల విలువైన 4.85 కోట్ల టన్నుల ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేసిందంటేనే తెలంగాణ ఎవుసం ఎంత కళకళలాడుతున్నదో అర్థమవుతున్నది. కరోనాకాలంలో మిగతా రాష్ర్టాలు చేతులెత్తేస్తే తెలంగాణ మాత్రం గ్రామాల్లోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మరీ ధాన్యం కొనుగోలు చేసింది.