హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర 2021 -22 బడ్జెట్ సమావేశాలు ఈ నెల 15వ తేదీ తర్వాత ప్రారంభం అయ్యే అవకాశం ఉన్నట్లు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తెలిపారు. కాగా ఈసారి బడ్జెట్ ఆశాజనకంగా ఉండబోతున్నదని సీఎం సూచన ప్రాయంగా తెలిపారు. బడ్జెట్ ప్రతిపాదిత అంచనాల కోసం సీఎం కేసీఆర్ శనివారం ప్రగతి భవన్లో ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆర్ధిక పద్దులో పొందు పరచాల్సిన శాఖల వారి బడ్జెట్ అంచనాలను, అధికారులు అందించిన ఆర్ధిక నివేదికలను పరిగణలోకి తీసుకుని సీఎం పరిశీలించారు.
పలు సంక్షేమ, అభివృద్ది పథకాల అమలుతో పాటు, ఇప్పటికే అమలులో ఉన్న గొర్రెల పెంపకం కార్యక్రమాన్ని కూడా కొనసాగిస్తామని సీఎం తెలిపారు. ఈ పథకం ద్వారా యాదవులు, గొల్ల కుర్మల కుటుంబాలు ఆదాయాన్ని ఆర్జిస్తున్నందున ఇప్పటికే పంపిణీ చేసిన 3 లక్షల 75 యూనిట్లకు కొనసాగింపుగా మరో 3 లక్షల గొర్రెల యూనిట్ల పంపిణీకి గాను రానున్న బడ్జెట్లో ప్రతిపాదనలను పొందుపరచనున్నట్లు సీఎం తెలిపారు. గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం మెచ్చుకున్నదన్నారు. దేశంలోనే అత్యంత అధికంగా షీప్ పాపులేషన్ ఉన్న రాష్ట్రంగా తెలంగాణ పురోగమిస్తున్నదని కేంద్రం గుర్తించిన నేపధ్యంలో గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగిస్తామని సీఎం తెలిపారు. అదే విధంగా ఇప్పటికే కొనసాగుతున్న చేపల పెంపకం కార్యక్రమం గొప్పగా సాగుతున్నదనీ, మంచి ఫలితాలు కూడా వస్తున్నందున దాన్ని కూడా కొనసాగిస్తామని సీఎం వెల్లడించారు.
కరోనా ప్రభావం వల్ల రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ. 50 వేల కోట్ల మేర నష్టం వాటిల్లిందని దాని ప్రభావం లక్ష కోట్లకు చేరుకున్నదని సీఎం అన్నారు. కాగా కరోనాంతర పరిస్థితిలో రాష్ట్ర ఆర్ధిక కార్యకలాపాలు పుంజుకున్నాయని, వివిధ రూపాల్లో రాబడి పెరిగిందని, ఈ నేపథ్యంలో గత బడ్జెట్ కంటే రాబోయే బడ్జెట్ కేటాయింపులు ఎక్కువగానే ఉండే ఆస్కారమున్నదని సీఎం తెలిపారు.
నేటి ఉన్నతస్థాయి సమావేశంలో బడ్జెట్ అంచనాలు, కేటాయింపుల కోసం విధి విధానాలు ఖరారయ్యాయని, రేపటి నుంచి ఆర్ అండ్ బీ, పంచాయితీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, విద్యా, ఇరిగేషన్ తదితరర శాఖలను వరుసగా పిలిచి, ఫైనాన్స్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు సమావేశాలు నిర్వహిస్తారని సీఎం తెలిపారు. అన్ని శాఖలతో బడ్జెట్పై కసరత్తు ముగిసిన తరువాత తుది దశలో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన బడ్జెట్కు తుది మెరుగులు దిద్దడం జరుగుతుంది.
ఈ సమావేశంలో ఆర్ధికశాఖ మంత్రి హరీశ్ రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, సీఎస్ సోమేశ్ కుమార్, సీఎం ముఖ్య కార్యదర్శి ఎస్. నర్సింగ రావు, ఆర్ధిక సలహాదారు జీఆర్ రెడ్డి, ఆర్ధికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ రామకృష్టారావు, కార్యదర్శి రోనాల్డ్ రాస్, సీఎంవో అధికారులు భూపాల్ రెడ్డి, స్మితా సభర్వాల్, తదితరులు పాల్గొన్నారు.