బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల
విప్ బాల్క సుమన్తో కలిసి పట్టాల పంపిణీ
మంచిర్యాల, జూన్ 10(నమస్తే తెలంగాణ): తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు ఏ రాష్ట్రంలోనూ ప్రజలకు అందడం లేదని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలోని సరస్వతీ శిశుమందిర్లో ఏర్పాటు చేసిన రెండో విడత పట్టాల పంపిణీ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
సింగరేణి భూముల క్రమబద్ధీకరణ చేయాలని 2009లో సమైక్య రాష్ట్రంలో ఎంత మొత్తుకున్నా పట్టించుకోలేదన్నారు. స్వరాష్ట్రంలో జీవో 76 కోసం ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే బాల్క సుమన్ పోరాటం చేసి సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఇండ్ల పట్టాలు అందిస్తున్నారని తెలిపారు. తెలంగాణ వస్తే ఏమొస్తది అనేవారికి ఇంతకన్నా ఏం సమాధానం కావాలని ప్రశ్నించారు.
కాంగ్రెసోళ్లు ఢిల్లీకి ఏజెంట్లు..
బీజేపోళ్లు గుజరాత్ బానిసలు: బాల్క
కాంగ్రెస్, బీజేపీ నాయకులు రాజకీయాలను కలుషితం చేసి ప్రజల్లో విషబీజాలు నాటుతున్నారని, రెండు పార్టీలు కలిసి కేసీఆర్ను విమర్శించడం విడ్డూరంగా ఉన్నదని ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. కాంగ్రెసోళ్లు ఢిల్లీకి ఏజెంట్లని, బీజేపోళ్లు గుజరాత్ బానిసలని విమర్శించారు. సింగరేణిలో 16 వేల మందికిపైగా తండ్రుల ఉద్యోగాలు బిడ్డలకు అందేలా చేసింది కేసీఆరేనని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జోగురామన్న, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దండె విఠల్, కలెక్టర్ భారతీ హోళీకేరీ పాల్గొన్నారు.