స్వయం పాలనలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన సంసరణలతో, పట్టణ ప్రగతి గుణాత్మక దిశగా సాగుతూ, దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది. స్వచ్ఛ సర్వేక్షణ్-2022 అవార్డులు పట్టణ ప్రగతి కోసం చేస్తున్న కృషికి దర్పణంగా నిలుస్తున్నాయి.
– సీఎం కేసీఆర్
పట్టణాలు, గ్రామాల అభివృద్ధి పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమే ఈ అవార్డులు. వినూత్న విధానాలు, నిర్ణయాలతో తెలంగాణ అనేక రంగాల్లో దేశానికి దిక్సూచిగా, ఆదర్శ నమూనాగా నిలుస్తున్నది.
– మంత్రి కేటీఆర్
హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): స్వచ్ఛతలో తెలంగాణకు సాటిలేదని మరోసారి రుజువైంది. పల్లెలే కాకుండా పట్టణాల్లో కూడా పారిశుద్ధ్యం నిర్వహణలో రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది. పల్లెల్లో స్వచ్ఛత విషయంలో దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిన తెలంగాణ, పట్టణాల్లో సైతం సత్తా చాటింది. రాష్ట్రంలోని 16 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలు స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులను దక్కించుకున్నాయి. పట్టణాలలో పారిశుద్ధ్యం, మున్సిపల్ ఘనవ్యర్థాల నిర్వహణ, ప్రజా మరుగుదొడ్లు తదితర అంశాల్లో ఉత్తమ పనితీరును కనబర్చినందుకు ఈ అవార్డులు అందజేస్తారు. అవార్డులు పొందిన పట్టణ పురపాలికల్లో జీహెచ్ఎంసీ శివార్లలో ఉన్న నాలు గు మున్సిపాలిటీలున్నాయి.
కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ రాష్ట్రంలోని 70 పట్టణ స్థానిక సంస్థలను ఓడీఎఫ్ ప్లస్గా, 40 పట్టణ స్థానిక సంస్థలను ఓడీఎఫ్ ప్లస్ ప్లస్గా, ఒకదానిని వాటర్ ప్లస్, మిగిలిన 31 పట్టణ స్థానిక సంస్థలను ఓడీఎఫ్ పట్టణాలుగా ప్రటించింది. కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ శనివారం అవార్డులు పొందిన పట్టణాల జాబితాను ప్రకటించింది. రాష్ట్రం నుంచి ఎంపికైన పట్టణాలపై పట్టణాభివృద్ధిశాఖ సంయుక్త కార్యదర్శి రూపా మిశ్రా రాష్ట్రానికి లేఖ రాశారు. ఈ అవార్డులను అక్టోబరు ఒకటిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీ దుగా ఢిల్లీలో ప్రదానం చేస్తారని ఆమె ఆ లేఖ లో తెలిపారు. ఈ అవార్డులు తెలంగాణ ప్రభు త్వం పట్టణ ప్రగతి కోసం చేస్తున్న కృషికి దర్పణంగా నిలుస్తున్నాయని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని 16 పట్టణాలు అవార్డుకు ఎంపికవడంపై మున్సిపల్ శాఖమంత్రి కే తారకరామారావు హర్షం వ్యక్తంచేశారు.
పారిశుద్ధ్యమే ప్రాతిపదిక
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులకు ఎంపిక చేసేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ జూలై 2021 నుంచి జనవరి 2022 వరకు జాతీయ స్థాయి శానిటేషన్ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా ఉన్న 4,355 పట్టణ స్థానిక సంస్థల్లో స్వచ్ఛ సర్వేక్షణ్ నిర్వహించారు. అవార్డులకు ఎంపిక చేయడానికి 90 అంశాలను ప్రాతిపదికగా తీసుకొన్నారు. ఘన వ్యర్థాల నిర్వహణ, చెత్తలేని వాణిజ్య ప్రాంతాలు, చెత్త నుంచి ఎరువుల తయారీ, మరుగుదొడ్ల నిర్వహణ, పారిశుద్ధ్యంపై స్థానికులకున్న అవగాహన, సృజనాత్మకత తదితర అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్రంలో అమలుచేస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమంతో అనేక పట్టణాల్లో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. ఇప్పటివరకు నాలుగు విడతలుగా చేపట్టిన పట్టణ ప్రగతితో పట్టణాల రూపురేఖలు మారిపోయాయి.
మరుగుదొడ్లు, ఎఫ్ఎస్టీపీలు..
రాష్ట్రంలో పట్టణ ప్రగతిలో భాగంగా చెత్తను సేకరించేందుకు 4,713 స్వచ్ఛ ఆటోలను కొనుగోలు చేశారు. మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ కొత్తగా 1.57 లక్షల వ్యక్తిగత మరుగుదొడ్లు, 9088 పబ్లిక్ మరుగుదొడ్లు నిర్మించింది. పట్టణాలు, నగరాల్లో ప్రతి వేయి మందికి ఒక పబ్లిక్ టాయిలెట్ నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ విధానం దేశానికి ఆదర్శంగా నిలిచింది. మరుగుదొడ్ల నిర్వహణకు టాయిలెట్ మానిటరింగ్ సిస్టంను ఏర్పాటు చేశారు. ఈ విధానంలో వారానికి రెండుసార్లు మరుగుదొడ్లను తనిఖీచేస్తారు. మరుగుదొడ్ల నుంచి వచ్చే వ్యర్థాలను శుద్ధిచేసేందుకు 139 ఎఫ్ఎస్టీపీటను నిర్మిస్తున్నారు. వీటిలో 20 పూర్తయ్యాయి.
నిబద్ధతకు నిదర్శనం అవార్డులు : కేటీఆర్
తెలంగాణలోని పురపాలికలు ఈ సంవత్సరం కూడా భారీగా స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులకు ఎంపిక కావడం పట్ల పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పురపాలక సిబ్బంది, అధికారులను అభినందించారు. అవార్డులకు ఎంపికైన 16 పట్టణాల్లోని ప్రజలు, ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు. పట్టణాలు, గ్రామాల అభివృద్ధి పట్ల తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతకు నిదర్శనమే ఈ అవార్డులని తెలిపారు. తనదైన వినూత్నమైన విధానాలు, నిర్ణయాలతో తెలంగాణ అనేక రంగాల్లో దేశానికి దిక్సూచిగా, ఆదర్శ నమూనాగా నిలుస్తున్నదని అన్నారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పట్టణాల అభివృద్ధి కోసం అనేక విప్లవాత్మకమైన కార్యక్రమాలను చేపట్టామని అన్నారు. నూతన పురపాలక చట్టం, పట్టణ ప్రగతితో పట్టణాల్లో గుణాత్మకమైన మార్పు వచ్చిందని తెలిపారు. కేవలం పాలనాపరమైన సంసరణలు చేపట్టి వదిలేయకుండా, బడ్జెట్ నుంచి నిరంతరం నిధులు అందించడంతో ప్రజలకు మౌలిక సేవలు అందుతున్నాయని తెలిపారు. దేశంలో ఎకడాలేని విధంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో పౌరుల భాగస్వామ్యాన్ని పెంచేందుకు అవకాశం కలిగిందని, దీంతోపాటు అధికారులు తమ విధులను మరింత సమర్థంగా నిర్వహించేందుకు స్ఫూర్తి కలిగిందని అన్నారు. పట్టణాల్లో పారిశుద్ధ్యం, పారుల అభివృద్ధి ద్వారా పచ్చదనాన్ని పెంచడం, హరిత వనాలు, నర్సరీల ఏర్పాటు, ఫుట్పాత్ల నిర్మాణం వంటి ప్రాథమిక అంశాలపై దృష్టి సారించడంతో పట్టణాల్లో మార్పు వేగంగా సాధ్యమైందని కేటీఆర్ తెలిపారు.
స్వయంపాలనతో తెలంగాణ ప్రగతి
స్వచ్ఛ సర్వేక్షణ్ అవార్డులపై సీఎం కేసీఆర్ హర్షం
‘స్వయం పాలనలో తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన సంసరణలతో, పట్టణ ప్రగతి గుణాత్మక దిశగా సాగుతూ, దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నది’ అని ముఖ్యమంత్రి చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించిన స్వచ్ఛ సర్వేక్షణ్-2022 అవార్డుల్లో రాష్ట్రంలోని 16 పట్టణ స్థానిక సంస్థలు అవార్డులు గెలుచుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డులు తెలంగాణ ప్రభుత్వం పట్టణ ప్రగతి కోసం చేస్తున్న కృషికి దర్పణంగా నిలుస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రామీణ స్వచ్ఛ భారత్ మిషన్ కింద తెలంగాణ రాష్ట్రం పలు విభాగాల్లో 13 అవార్డులను గెలుచుకున్న విషయాన్ని ఈ సందర్భంగా సీఎం గుర్తు చేశారు. పట్టణాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన నూతన పురపాలక చట్టంతోపాటు, విడతల వారీగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమాలు సత్ఫలితాలనిచ్చాయని వెల్లడించారు. పట్టణాల్లో మౌలిక వసతుల కల్పన, పారిశుద్ధ్యం, పట్టణ హరిత వనాల ఏర్పాటు, గ్రీన్ కవర్ పెంపు, నర్సరీల ఏర్పాటు, ఓడీఎఫ్ల దిశగా కృషితోపాటు పలు అభివృద్ధి చర్యలు చేపట్టడం ద్వారా గుణాత్మక ప్రగతి సాధ్యమైందని సీఎం తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమాలను సమర్థవంతంగా నిర్వహిస్తూ దేశానికి తెలంగాణను ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేసిన, రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్కు, ఆ శాఖ ఉన్నతాధికారులకు, సిబ్బందికి, భాగస్వాములైన అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులకు సీఎం కేసీఆర్ అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వ ఆశయాల సాధన దిశగా ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు ఇదే స్ఫూర్తితో ప్రజల భాగస్వామ్యంతో ముందుకుసాగాలని పిలుపునిచ్చారు.
1. ఆదిభట్ల మున్సిపాలిటీ
2. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్
3. భూత్పూర్ మున్సిపాలిటీ
4. చండూర్ మున్సిపాలిటీ
5. చిట్యాల మున్సిపాలిటీ
6. గజ్వేల్ మున్సిపాలిటీ
7. ఘట్కేసర్ మున్సిపాలిటీ
8. హుస్నాబాద్ మున్సిపాలిటీ
9. కొంపల్లి మున్సిపాలిటీ
10. కోరుట్ల మున్సిపాలిటీ
11. కొత్తపల్లి మున్సిపాలిటీ
12. నేరేడుచర్ల మున్సిపాలిటీ
13. సికింద్రాబాద్ కంటోన్మెంట్
14. సిరిసిల్ల మున్సిపాలిటీ
15. తురయాంజాల్ మున్సిపాలిటీ
16. వేములవాడ మున్సిపాలిటీ