హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, పరిపాటి జనార్దన్రెడ్డికి సభ సంతాపం తెలిపి రెండు నిమిషాలు మౌనం పాటించిన అనంతరం ఈ నెల 12కు సమావేశాలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వాయిదావేశారు. ఉభయ సభల సమావేశాలను ఈ నెల 12, 13 తేదీల్లో నిర్వహించాలని మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అధ్యక్షతన వేర్వేరుగా జరిగిన సభా నిర్వహణ సలహా కమిటీ(బీఏసీ) సమావేశాల్లో నిర్ణయించారు. డిప్యూటీ స్పీకర్ టీ పద్మారావుగౌడ్, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాసర్, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార, శాసనసభ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు అసెంబ్లీ బీఏసీ భేటీలో పాల్గొన్నారు. మండలి బీఏసీ భేటీలో మంత్రులు వేముల ప్రశాంత్రెడ్డి, హరీశ్రావు, విప్ ఎంఎస్ ప్రభాకర్రావు, కాటేపల్లి జనార్దన్రెడ్డి పాల్గొన్నారు. ఈ నెల 16 నుంచి మూడు రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైక్యత ఉత్సవాలు జరుగనున్న నేపథ్యంలో సభా కార్యక్రమాలను 12, 13 తేదీలలో నిర్వహించాలని బీఏసీలు నిర్ణయించాయి.
మంగళవారం అసెంబ్లీ ఆవరణలో సీఎం కేసీఆర్కు స్వాగతం పలుకుతున్న శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి. చిత్రంలో మంత్రి జగదీశ్రెడ్డి, చీఫ్విప్ వినయ్భాస్కర్, ఎమ్మెల్యే జీవన్రెడ్డి తదితరులు
మల్లు స్వరాజ్యం, జనార్దన్రెడ్డి సేవలు చిరస్మరణీయం
ఉదయం 11 గంటలకు జాతీయ గీతాలాపనతో అసెంబ్లీ సమావేశాలు ప్రారం భం అయ్యాయి. ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు మల్లు స్వరాజ్యం, పరిపాటి దామోదర్రెడ్డి అం దించిన సేవలను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి కొనియాడారు. తుంగతుర్తి నియోజకవర్గం నుంచి మల్లు స్వరాజ్యం ప్రాతినిధ్యం వహించి పలు ప్రజాసమస్యల పరిష్కారంలో విశేషంగా కృషి చేశారని స్పీకర్ పోచారం తెలిపారు. రైతాంగ సాయుధ పోరాటంలో తుపాకీ పట్టిన తొలి మహిళ అని, స్త్రీ చైతన్యానికి అనేక కార్యక్రమాలు నిర్వహించారన్నారు. అలాగే సమితి ప్రెసిడెంట్, కమలాపూర్ ఎమ్మెల్యేగా పరిపాటి జనార్దన్రెడ్డి చేసిన సేవలను గుర్తుచేశారు. మరణించిన మాజీ సభ్యులకు సభ సంతాపం ప్రకటించింది.
సభ ముందు నివేదికలు
విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఎన్పీడీసీఎల్ 21వ వార్షిక (2020-21) నివేదికను, సినిమాటోగ్రఫీశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ 4వ వార్షిక (2020-21) నివేదికను, హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ఆగస్టు 16, 2022న హోంశాఖ జారీ చేసిన ప్రైవేట్ సెక్యూరిటీ ఏజెన్సీ నియమావళి ప్రతిని సభ ముందు ఉంచారు. ఈ సమావేశాల ప్యానల్ స్పీకర్లుగా ఎమ్మెల్యేలు రెడ్యానాయక్, మహమ్మద్ మోజంఖాన్, మంచిరెడ్డి కిషన్రెడ్డి, హన్మత్షిండే వ్యవహరిస్తారని పోచారం పేర్కొన్నారు. కరోనా పరిస్థితి అంత తీవ్రంగా లేనికారణంగా సభ్యుల సిట్టింగ్ పాత పద్ధతిలోనే ఉంటుందని తెలిపారు. కాగా అసెంబ్లీ సమావేశాలకు హాజరైన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావును అసెంబ్లీ ప్రాంగణంలో మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాస్కర్, అసెంబ్లీ కార్యదర్శి వీ నర్సింహాచార్యులు, టీఆర్ఎస్ఎల్పీ కార్యదర్శి రమేశ్రెడ్డి స్వాగతించారు.