Telangana assembly session | తెలంగాణ శాసనసభ ఎనిమిదో విడత సమావేశాలు శుక్రవారం నుంచి నిర్వహించనున్నారు. ఇప్పటికే అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే శాసనసభ, మండలి.. అక్టోబర్ 1 వరకు కొనసాగే అవకాశముంది. సభ జరిగే తేదీలు, ఎజెండా తదితరాలపై అసెంబ్లీ సమావేశాల తొలి రోజున జరిగే బిజినెస్ అడ్వైజరీ కమిటీ (బీఏసీ) భేటీలో నిర్ణయిస్తారు.
శని, ఆది వారాల్లో విరామం తర్వాత తిరిగి ఈ నెల 27 నుంచి వరుసగా ఐదు రోజుల పాటు సభలు సాగే అవకాశముంది. ప్రొటెమ్ చైర్మన్ హోదాలో వెన్నవరం భూపాల్రెడ్డి తొలిసారి మండలి సమావేశాలను నిర్వహించనున్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ‘దళితబంధు’కు చట్టబద్దత కల్పించే బిల్లుతో పాటు మరో ఏడు బిల్లులు సభ ముందుకు వచ్చే అవకాశమున్నట్లు సమాచారం. కొన్ని ఆర్డినెన్స్లకు చట్టబద్ధత కల్పించే బిల్లులు కూడా ఇందులో ఉన్నట్లు తెలిసింది. వరి ధాన్యం కొనుగోలు, నదీ జలాల వివాదం, దళితబంధు పథకం, ఉద్యోగాల భర్తీ, సింగరేణి కాలనీలో ఆరేళ్ల చిన్నారిపై అత్యాచారం, హత్య ఘటన వంటి అంశాలు సమావేశాల్లో చర్చకు వచ్చే అవకాశముంది.
అసెంబ్లీ సమావేశాలను కొవిడ్ నిబంధనలకు అనుగుణంగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది. గతంలో మాదిరిగానే పోలీస్, మీడియా, అధికారులు, శాసనసభ, మండలి సభ్యుల వెంట వచ్చే సహాయ సిబ్బందిని పరిమిత సంఖ్యలో అనుమతించాలని నిర్ణయించారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యే ప్రజాప్రతినిధులతో పాటు అధికారులు, పోలీసులు, మీడియా ప్రతినిధులు కోవిడ్ పరీక్షలు తప్పనిసరిగా చేయించుకోవాలన్న గత నిబంధనను పాక్షికంగా సడలించారు. ఎవరికైనా కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు అనుమానం ఉంటే పరీక్షలు చేయించుకునేందుకు వీలుగా అసెంబ్లీ ఆవరణలో కరోనా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. వీటితో పాటు వ్యాక్సినేషన్ సెంటర్లు కూడా ఏర్పాటు చేసి అవసరమైన వారికి తొలి, రెండో దశ కోవిడ్ టీకాలు ఇవ్వాలని నిర్ణయించారు.
తెలంగాణ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు శుక్రవారం నుంచి ప్రారంభమవుతున్న నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లోని 4 కి.మీ. పరిధిలో సభలు, సమావేశాలు, ఊరేగింపులను నిషేధించినట్టు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
వివిధ ప్రజా సమస్యలపై అసెంబ్లీలో జరిగే చర్చలకు ఎలాంటి ఆటంకం కలగకూడదని ఈ నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నట్టు తెలిపారు. శుక్రవారం ఉదయం 6గంటల నుంచి అమల్లోకి వచ్చే ఈ నిషేధాజ్ఞలు అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు ముగిసే వరకూ వర్తిస్తాయని ఆయన తెలిపారు.