హైదరాబాద్: ఐదు రోజుల విరామం అనంతరం శాసనసభ, శాసనమండలి తిరిగి నేడు సమావేశమవనుంది. కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్తు సవరణ బిల్లుపై ఉభయసభల్లో స్వల్పకాలిక చర్చ జరుగనున్నది. ఉభయ సభలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే బిల్లుపై చర్చిస్తాయి. చర్చ ద్వారా రాష్ట్ర అభిప్రాయాన్ని కేంద్రానికి తెలుపనున్నారు. ఇటీవల మరణించిన పాలేరు మాజీ ఎమ్మెల్యే బీ భూపతిరావుకు సభ సంతాపం తెలుపనున్నది.
వివిధ శాఖలకు చెందిన ఏడు చట్ట సవరణ బిల్లులను ప్రభుత్వం శాసనసభలో ప్రవేశపెట్టనున్నది. వీటిలో మున్సిపల్శాఖ చట్ట సవరణ, జీఎస్టీ చట్ట సవరణ, అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా చట్ట సవరణ, వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించిన సవరణ, అటవీ యూనివర్సిటీకి సంబంధించిన, తెలంగాణ యూనివర్సిటీ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు, తెలంగాణ మోటర్ వెహికిల్స్ టాక్సేషన్ సవరణ బిల్లులు ఉన్నాయి. వీటితోపాటు మరికొన్ని బిల్లులు ప్రవేశపెట్టనున్నారు.
తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్మెంట్ బోర్డు బిల్లును విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి సభలో ప్రవేశపెట్టనున్నారు. రాష్ట్రంలోని 15 వర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బంది పోస్టుల భర్తీకి కామన్ బోర్డు ఏర్పాటుకు ప్రభుత్వం గతంలోనే పచ్చజెండా ఊపింది. ఈ మేరకు విద్యాశాఖ గతంలోనే జీవో సైతం జారీచేసింది. యూజీసీ నిబంధనలు అనుసరించే కామన్ బోర్డు పనిచేయనున్నది.