హైదరాబాద్, సెప్టెంబర్ 4(నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభ సమావేశాల పనితీరు దేశానికే ఆదర్శంగా ఉన్నదని స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకొంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలని ఆకాంక్షించారు. మంగళవారం నుంచి ప్రారంభంకానున్న శాసనసభ, శాసనమండలి సమావేశాల నిర్వహణ, భద్రతపై రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు, పోలీస్ అధికారులతో ఆదివారం స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. బాన్సువాడ నుంచి టెలికాన్ఫరెన్స్లో పాల్గొన్న స్పీకర్ మాట్లాడుతూ.. సభ్యులు అడిగిన సమాచారాన్ని సాధ్యమైనంత త్వరగా అందించాలని అధికారులను కోరారు.
గత సమావేశాలకు సంబంధించిన ప్రశ్నలకు పెండింగ్లో ఉన్న జవాబులను వెంటనే పంపించాలని సూచించారు. సభ్యులు అడిగిన సమాచారాన్ని తెలుగు, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో ఇవ్వాలని చెప్పారు. సమావేశాలు ముగిసేవరకు ఉన్నతాధికారులు అందుబాటులో ఉండాలని, ప్రతి శాఖ నుంచి ఒక నోడల్ అధికారిని నియమించాలని ఆదేశించారు. నియోజకవర్గాల్లో ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించినప్పుడు తప్పనిసరిగా ప్రొటోకాల్ పాటిస్తూ, స్థానిక శాసనసభ్యునికి ముందస్తుగా సమాచారం ఇవ్వాలని చెప్పారు. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో అసెంబ్లీ డిస్పెన్సరీలో కొవిడ్ టెస్టులకు ఏర్పాట్లు చేయాలని, బూస్టర్డోస్ వ్యాక్సిన్ను అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. హైదరాబాద్లోని తన నివాసం నుంచి గుత్తా సుఖేందర్రెడ్డి మాట్లాడుతూ.. సమావేశాలు ప్రశాంతంగా కొనసాగేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ వీ నరసింహాచార్యులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్కుమార్, డీజీపీ మహేందర్రెడ్డి, స్పెషల్ సీఎస్లు రామకృష్ణారావు, అర్వింద్కుమార్, కార్యదర్శులు శేషాద్రి, ఎస్ఏఎం రిజ్వి, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్కుమార్, హోంశాఖ కార్యదర్శి రవిగుప్త, సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, అసెంబ్లీ చీఫ్ మార్షల్ కరుణాకర్ పాల్గొన్నారు.