హైదరాబాద్, అక్టోబర్ 17 (నమస్తే తెలంగాణ): దేశంలో పెట్రోల్ ధరలు రోజురోజుకూ మండిపోతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతున్నది. దీంతో పలు సంస్థలు తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహన (ఈవీ) తయారీ పరిశ్రమలను నెలకొల్పేందుకు ఆసక్తి చూపుతున్నాయి. ఇలాంటి పరిశ్రమల కోసం ప్రత్యేకంగా ఓ క్లస్టర్ను ఏర్పాటు చేయాలని పరిశ్రమల శాఖ భావిస్తున్నది. ఇందుకోసం మంత్రి కేటీఆర్ ఆదేశాల మేరకు పరిశ్రమలశాఖ అధికారులు రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలోని సీతారాంపూర్లో వెయ్యి ఎకరాల స్థలాన్ని గుర్తించారు. అందులో 500 ఎకరాల్లో జనరల్ పార్కును, మిగిలిన 500 ఎకరాల్లో ఎలక్ట్రిక్ వాహనాల క్లస్టర్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విద్యుత్ వాహనాల తయారీని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం గతేడాది ‘తెలంగాణ ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ’ని ప్రవేశపెట్టడంతో ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ముందుకొస్తున్నాయి. మైత్రా, ఒలెక్ట్రా, ట్రైటాన్ లాంటి ప్రముఖ కంపెనీలు ఇప్పటికే రూ.5 వేలకోట్ల పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యాయి. వీటిద్వారా దాదాపు 12 వేలమందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనున్నది. ఇదేవిధంగా గ్రేటర్ నోయిడాలోని జెమోపాయ్ ఎలక్ట్రిక్, ముంబాయికి చెంది బీజియెస్ ఎలక్ట్రిక్, హర్యానాలోని గుర్గావ్కు చెందిన ఎవోలెట్ ఇండియా తదితర సంస్థలు దక్షిణాదిలో ఉన్న మార్కెట్ను దృష్టిలో పెట్టుకొని తెలంగాణలో తమ యూనిట్లను నెలకొల్పేందుకు ముందుకొస్తున్నాయి. ఈ సంస్థల ప్రతినిధులు ఇప్పటికే రాష్ట్ర అధికారులతో చర్చలు జరిపారు.
ఈవీ క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు
ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు మంచి భవిష్యత్తు ఉన్నది. ఈవీ పరిశ్రమలను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం దేశంలోనే అత్యంత మెరుగైన విధానాన్ని ప్రవేశపెట్టింది. ఈ పాలసీ ఎంతో ఆకర్షణీయంగా ఉండడంతో పలు సంస్థలు ఇక్కడ పరిశ్రమల స్థాపనకు ఆసక్తి చూపుతున్నాయి. ఈ పరిశ్రమల కోసం ప్రత్యేకంగా ఓ క్లస్టర్ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి సీతారాంపూర్లో స్థలాన్ని ఎంపికచేశాం. – జయేశ్రంజన్, పరిశ్రమలశాఖ ముఖ్య కార్యదర్శి