హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): గోదావరి నదీజలాల బోర్డు పరిధి నోటిఫికేషన్ గెజిట్పై అభ్యంతరాలుంటే కేంద్రప్రభుత్వంతో తేల్చుకోవాలని బోర్డు కోఆర్డినేషన్ కమిటీ ఆంధ్రప్రదేశ్ సర్కారుకు స్పష్టంచేసింది. మంగళవారం జరిగిన జీఆర్ఎంబీ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఏపీ అధికారులు గెజిట్లోని పలు అంశాలపై అభ్యంతరాలు వ్యక్తంచేశారు. దీనిపై స్పందించిన జీఆర్ఎంబీ.. గెజిట్ను అమలుచేయడమే తప్ప మార్పులు చేపట్టే అధికారం తమకు లేదని తేల్చిచెప్పింది. బోర్డు పూర్తిస్థాయి మీటింగ్కు పట్టుబట్టిన తెలంగాణ ప్రభుత్వం.. ఈ సమావేశానికి గైర్హాజరైంది. మరోవైపు ఇదే సందర్భంగా కేఆర్ఎంబీ కోఆర్డినేషన్ సమావేశం నిర్వహించాల్సి ఉండగా, ఆ సమావేశానికి సైతం తెలంగాణ అధికారులు హాజరుకాలేదు. కేంద్రం ఇటీవల విడుదలచేసిన గెజిట్లోని అంశాలను అమలుచేయడంలో భాగంగా జీఆర్ఎంబీ కోఆర్డినేషన్ కమిటీ మంగళవారం సమావేశమైంది. ఈ సమావేశానికి ఏపీ అధికారులు మాత్రమే వచ్చారు. ఈ సందర్భంగా ఏపీ అధికారులు తెలంగాణ ప్రాజెక్టులపై విషం కక్కారు. ఇప్పటివరకు కృష్ణా జలాల వినియోగంపై వివాదాలు సృష్టించిన ఏపీ సర్కారు.. తాజాగా ఎలాంటి వివాదాలు లేని గోదావరి బేసిన్పై కూడా అభ్యంతరాలు వ్యక్తచేయడం విడ్డూరం. సమావేశం అనంతరం ఏపీ ఈఎన్సీ నారాయణరెడ్డి చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనం. భవిష్యత్లో గోదావరి నది పెద్ద సమస్యగా మారబోతున్నదని, ఉమ్మడి ఏపికి 1430 టీఎంసీల నీటిని కేటాయిస్తే, ఒక్క తెలంగాణే 1350 టీఎంసీల నీటిని వాడుకొనేందుకు ప్రాజెక్టులను కడుతున్నదని అక్కసు వెళ్లగక్కారు.
అనుమతి లేకుండా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించాలని నిర్ణయించిన కేఆర్ఎంబీని అడ్డుకొనేందుకు ఏపీ ప్రభుత్వం మరో ఎత్తు వేసింది. ప్రాజెక్టు పరిశీలనకు వచ్చే అధికారుల బృందంలో తెలంగాణ అధికారి ఉండరాదని కేఆర్ఎంబీకి లేఖ రాసింది. ఎన్జీటీ ఆదేశంతో సీమ ప్రాజెక్టును ఈ నెల 5న సందర్శిస్తామని ఏపీకి కేఆర్ఎంబీ లేఖ రాసింది. సీమ ప్రాజెక్టును సందర్శించే కేఆర్ఎంబీ బృందంలో సీడబ్ల్యూసీకి చెందిన ఇంజినీర్ దేవేందర్ ఉన్నారు. ఆయన తెలంగాణ ప్రాంతీయుడు. దేవేందర్ను లక్ష్యంగా చేసుకొనే కేఆర్ఎంబీకి ఏపీకి లేఖ రాసినట్టు సమాచారం.