మొదటిరోజు 4,558 మందికి కొవిడ్ వ్యాక్సిన్
అర్హులంతా టీకా వేసుకోవాలి: గవర్నర్
వ్యాక్సిన్ తీసుకున్న మంత్రి ఈటల
టీకాలపై ఆపోహలు వద్దని సూచన
కరోనా వ్యాక్సినేషన్పై నెలకొన్న అపోహలను పటాపంచలుచేస్తూ.. ‘టీకా వేసుకోండి.. కొవిడ్ వైరస్ నుంచి శాశ్వత విముక్తి పొందండి’ అంటూ స్ఫూర్తిదాయకంగా నిలిచారు హైదరాబాద్కు చెందిన ఫ్రీడం ఆయిల్ కంపెనీ వ్యవస్థాపకుడు వందేండ్ల జయదేవ్ చౌదరి. అరవై ఏండ్లు దాటిన వారికి, దీర్ఘకాలిక రోగులకు సోమవారం నుంచి దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటురంగంలో మొదటి డోసు వ్యాక్సినేషన్ ప్రారంభమైంది.
హైదరాబాద్, మార్చి 01 (నమస్తే తెలంగాణ)/ హుజూరాబాద్: రాష్ట్రంలో రెండోదశ కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. 60 ఏండ్ల వయసుదాటినవారితోపాటు దీర్ఘకాలిక వ్యాధులున్న 45-59 ఏండ్ల మధ్య వయస్కులకు రెండోదశలో వ్యాక్సిన్ వేస్తున్నారు. తొలిరోజు ప్రభుత్వ, ప్రైవేటు దవాఖానల్లోని మొత్తం 93 కేంద్రాల్లో 4,558 మంది వ్యాక్సిన్ తీసుకున్నట్టు వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. సోమవారం హెల్త్కేర్ వర్కర్లు 249 మంది మొదటి డోసు టీకా తీసుకోగా, రెండోడోసు 70 మంది వేసుకున్నారు. ఫ్రంట్లైన్ వారియర్లలో 51 మంది మొదటి డోసు, 16 మంది రెండోడోసు తీసుకున్నారు.
ఇప్పటివరకు రాష్ట్రంలో మొదటిడోసు తీసుకున్న వారి సంఖ్య 3 లక్షలకు చేరగా, రెండోడోసు 1.47 లక్షల మంది వేసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకోవాలనుకొనే ప్రియారిటీ గ్రూపువారు తప్పనిసరిగా కోవిన్ పోర్టల్లో రిజిస్టర్ చేసుకోవాలని అధికారులు సూచించారు. వారం చివరినాటికి టీకా కేంద్రాలను 1,000కి పెంచుతామని తెలిపారు. ఒక్కో డోసుకు ప్రభుత్వం నిర్దేశించిన రూ.250 కంటే ఎక్కువ వసూలు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. అర్హులంతా కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌదరరాజన్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని పలు అంశాలపై పుదుచ్చేరి నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. రాజ్భవన్లో పనిచేస్తున్న ఒక హోంగార్డు తన కూతురు వైద్యానికి సాయం చేయాలని కోరగా.. గవర్నర్ వెంటనే నిలోఫర్ దవాఖాన సీనియర్ పీడియాట్రిక్ సర్జన్తో మాట్లాడి అవసరమైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
టీకా వేసుకున్న మంత్రి ఈటల
రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ కరోనా టీకా వేసుకొన్నారు. సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ ప్రభుత్వ దవాఖానలో వ్యాక్సిన్ తీసుకున్నారు. కరోనా టీకాలు దశలవారీగా అందరికీ వేస్తామని తెలిపారు. వ్యాక్సిన్పై ప్రజలు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని సూచించారు. టీకా వచ్చిందికదా అని కరోనాను నిర్లక్ష్యం చేయవద్దని, తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని కోరారు. మంత్రితోపాటు బీసీ కమిషన్ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్రావు, జమ్మికుంట మార్కెట్ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి కూడా టీకా వేసుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వైద్య విధాన పరిషత్ ప్రిన్సిపల్ కార్యదర్శి రమేశ్రెడ్డి, కలెక్టర్ శశాంక్, జిల్లా వైద్యాధికారి సుజాత, డిప్యూటీ డీఎంహెచ్వో జువేరియా, సూపరిండెంటెంట్ రమేశ్, మున్సిపల్ చైర్పర్సన్ గందె రాధిక పాల్గొన్నారు.
వ్యాక్సిన్ తీసుకొన్న వందేండ్ల వృద్ధుడు
కరోనా టీకా వేసుకొనేందుకు చాలామంది వెనుకాడుతున్న వేళ వందేండ్ల వృద్ధుడు టీకా తీసుకుని ఆదర్శంగా నిలిచాడు. నగరానికి చెందిన ఫ్రీడమ్ ఆయిల్ కంపెనీ వ్యవస్థాపకుడు జయ్దేవ్ చౌదరి (100) మెడికవర్ దవాఖానలో సోమవారం కరోనా టీకా తీసుకున్నారు. కరోనా టీకా కోసం ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నానని తెలిపారు. టీకాపై అపోహలను నమ్మకుండా విశ్వాసంతో వేసుకొనేందుకు ముందుకురావాలని పిలుపునిచ్చారు.