హైదరాబాద్ : ఆఫ్రికా ఖండంలో అత్యంత ఎత్తయిన పర్వతాన్ని అధిరోహించి ఔరా అనిపించారు రాష్ట్రానికి చెందిన యువకులు. ఆటవిడుపుగా రాక్ క్లైంబింగ్ను నేర్చుకొని.. కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి జాతీయ జెండాను ఎగుర వేసి, శెభాష్ అనిపించుకుంటున్నారు. హైదరాబాద్కు చెందిన మోరా విశ్వజీత్ (20), మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఉల్లేపల్లికి చెందిన యశ్వంత్ (17) మహారాష్ట్రకు చెందిన యోగేశ్వరి అనే యువతితో కలిసి ఇటీవల కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించారు. గత సంవత్సరం భువనగిరి రాక్ క్లైంబింగ్ స్కూల్లో లెవల్-1, లెవల్-2 శిక్షణ పూర్తి చేశారు.
ఇక్కడే వారికి కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాలనే ఆలోచన వచ్చింది. ఇందుకు జమ్మూకశ్మీర్లోని లద్దాఖ్కు వెళ్లి వారం రోజుల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత ఆఫ్రికా బయలుదేరి.. నాలుగు రోజుల శ్రమించి 5,895 మీటర్ల ఎత్తున్న పర్వతంపైకి చేరుకొని జాతీయ జెండాను ఎగుర వేశారు. పర్వతాన్ని అధిరోహించేందుకు మొత్తం ఆరు రోజుల సమయం పట్టిందని, పర్వతంపైకి వెళ్లేందుకు నాలుగు రోజులు, దిగడానికి రెండు రోజుల సమయం పట్టిందని విశ్వజీత్ తెలిపాడు. రాక్ క్లైంబింగ్పై ఉన్న ఆసక్తితో కొవిడ్ లాక్డౌన్ సమయంలో భువనగిరిలో రాక్ క్లైంబింగ్ నేర్చుకున్నానని పేర్కొన్నారు.
సాహసాలు తనకు చాలా ఇష్టమని, ఏడు ఖండాల్లోని ఎత్తయిన పర్వతాలను అధిష్టించాలనేది తన కలని పేర్కొన్నారు. త్వరలోనే రష్యాలోని మౌంట్ ఎల్బ్రస్ అధిరోహిస్తానని, ఇందుకు ఏర్పాట్లు చేసుకున్నట్లు వివరించారు. మిలటరీలో చేరాలనేది తన జీవితాశయమని మరో యువకుడు యశ్వంత్ తెలిపాడు. తనది నిరుపేద కుటుంబం కావడంతో కిలిమంజారో పర్వతం అధిరోహించేందుకు చాలా మంది దాతలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆర్థిక సహాయం అందించారని వివరించాడు. ప్రస్తుతం తాను ఆస్ట్రేలియాలోని హకాంగో పర్వతాన్ని అధిరోహించాలనుకుంటున్నానని, దాతలు వచ్చి సహాయం అందించాలని యశ్వంత్ కోరాడు.