హైదరాబాద్, ఆగస్టు 12 (నమస్తే తెలంగాణ): వ్యవసాయరంగంలో మరో అద్భుతాన్ని ఆవిష్కరించేందుకు తెలంగాణ సిద్ధమవుతున్నది. భారీ స్థాయిలో పామాయిల్ను ఉత్పత్తిచేసి దేశ అవసరాలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. వచ్చే ఐదేండ్లలో ఏకంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ను సాగుచేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నది. ఈ ఏడాది 2 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగుకు చర్యలు చేపట్టింది. మున్ముందు సాగు విస్తీర్ణాన్ని మరింత పెంచడం ద్వారా పామాయిల్ ఉత్పత్తిలో తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలపాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8 లక్షల ఎకరాల్లో మాత్రమే ఆయిల్పామ్ సాగవుతున్నది. ఇందులో ఏపీ 4 లక్షల ఎకరాల సాగుతో అగ్రస్థానంలో నిలిచింది. కాగా, దేశంలో ఆయిల్పామ్ సాగును 16 లక్షల ఎకరాలకు పెంచాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించింది. కానీ, తెలంగాణలోనే ఏకంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ను సాగుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకోవడం గమనార్హం.
అవసరం కోటి టన్నులు.. ఉత్పత్తి 4 లక్షల టన్నులే
దేశంలో పామాయిల్ వినియోగం భారీగా పెరగడంతో ఏటా రూ.60 వేల కోట్ల వరకు వెచ్చించి విదేశాల నుంచి కోటి టన్నులను దిగుమతి చేసుకోవాల్సి వస్తున్నది. డిమాండ్ ఇంత భారీగా ఉన్నా దేశంలో పామాయిల్ ఉత్పత్తి అంతంత మాత్రంగానే ఉన్నది. దేశవ్యాప్తంగా ఏటా 4 లక్షల టన్నుల పామాయిల్ మాత్రమే ఉత్పత్తి అవుతున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు ద్వారా ఏటా 35-40 లక్షల టన్నుల పామాయిల్ ఉత్పత్తి అవుతుంది. అంటే దేశ అవసరాల్లో 40% వరకు తెలంగాణ తీర్చనున్నది. తద్వారా విదేశాల నుంచి దిగుమతులు తగ్గి దేశానికి రూ.30 వేల కోట్లకుపైగా విదేశీ మారకద్రవ్యం ఆదా అవుతుంది.
రైతులకు సబ్సిడీలు
ఆయిల్పామ్ రైతుల కు రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలా అండగా నిలుస్తున్నది. రూ.300 ఉండే ఒక్కో మొక్కను రూ.20కే అందజేస్తున్నది. ఎకరం సా గుకు అయ్యే రూ.75-80 వేల ఖర్చులో ప్రభుత్వమే రూ.60 వేల వరకు సబ్సిడీ ఇస్తున్నది. ప్రతి ఎకరాకు రూ.18 వేల విలువైన డ్రిప్ను ఉచితంగా అందిస్తున్నది. దీనితోపాటు ఏటా దున్నకం, ఎరువుల ఖర్చు కోసం ఎకరానికి రూ. 4,200 చొప్పున నాలుగేండ్లకు రూ.16,800 అందిస్తున్నది.
దేశంలో నంబర్ 1.. ప్రపంచంలో నంబర్ 4
రాష్ట్రంలో ఆయిల్పామ్ సాగు 20 లక్షల ఎకరాలకు చేరితే దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో నిలవడంతోపాటు ప్రపంచంలో నాలుగో స్థానానికి ఎగబాకుతుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 8 లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగవుతున్నది. ఇందులో ఏపీ వాటా 4 లక్షల ఎకరాలు, తెలంగాణ వాటా 60 వేల ఎకరాలుగా ఉన్నది. ఈ ఏడాది రాష్ట్రంలో ఈ పంట విస్తీర్ణం 2.6 లక్షల ఎకరాలకు పెరగనున్నది. ఆయిల్పామ్ సాగులో ఇండోనేషియా ప్రపంచంలోనే అగ్రగామిగా కొనసాగుతున్నది. తర్వాతి స్థానాల్లో మలేషియా (2 కోట్ల ఎకరాలు), థాయిలాండ్ (60 లక్షల ఎకరాలు) ఉన్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ 20 లక్షల ఎకరాల టార్గెట్ను పూర్తిచేస్తే ప్రపంచంలో నాలుగో స్థానానికి చేరుతుంది. అంతేకాకుండా ఎకరాకు ఐదుగురు చొప్పున కోటి మందికి ఉపాధి లభిస్తుంది.