ముంబై: జాతీయ స్థాయిలో నిర్వహించిన బిగ్ బాస్-15 టైటిల్ను తేజస్వి ప్రకాశ్ గెలుచుకున్నది. ఫైనల్లో ప్రతీక్ సహజ్పాల్ ఫస్ట్, కరణ్ కుంద్రా సెకండ్ రన్నరప్గా నిలిచారు. ఆదివారం రాత్రి ప్రసారమైన కార్యక్రమంలో విజేతను కార్యక్రమ నిర్వాహకుడు అయిన సల్మాన్ ఖాన్ ప్రకటించారు. ట్రోఫీని బహూకరించగానే తేజస్వి ఆనందంతో ఉప్పొంగిపోయారు. బిగ్ బాస్ హౌజ్లోకి అడుగుపెట్టిన మొదట్లో అంతా కలగా అనిపించిందని, ఇలా ట్రోఫీని గెలుచుకోవడం సంతోషంగా ఉన్నదని తేజస్వి ప్రకాశ్ చెప్పారు. విన్నర్కు ట్రోఫీతో పాటు రూ.40 లక్షల ప్రైజ్ మనీని సల్మాన్ ఖాన్ అందజేశారు.
తేజస్వి తన బాయ్ఫ్రెండ్, తోటి కంటెస్టెంట్ కూడా అయిన కరణ్ కుంద్రా, షమితా శెట్టి, ప్రతీక్ సహజపాల్, నిశాంత్ భట్లతో ఫైనల్లో పోటీ పడి బిగ్ బాస్ టైటిల్ను చేజిక్కించుకున్నది. టాప్-6 కి చేరిన తర్వాత తక్కువ ఓట్లతో రష్మీ దేశాయ్ హౌజ్ను వీడింది. అదే సమయంలో నిశాంత్ భట్ రూ.10 లక్షల బ్రీఫ్కేస్తో స్వయంగా వెళ్లిపోయారు.
నాలుగు నెలల పాటు ప్రేక్షకులను అలరించిన బిగ్ బాస్-15 విజేతను ప్రకటించడంతో ముగిసింది. స్వరాగిణి నటిగా మంచి ఫాలోయింగ్ను సంపాదించుకున్న తేజస్వి ప్రకాశ్ బిగ్ బాస్-15 ట్రోఫీని ముద్దాడటంతో అభిమానులు పులకించిపోయారు. తేజస్వి బిగ్ బాస్ హౌస్ వెలుపల పెద్ద సంఖ్యలో అభిమానులున్నారు. సిల్సిలా బదల్తే రిస్తా కా-2 లో కనిపించిన ఈ నటి.. టీవీలో తన అద్భుతమైన నటనతో పెద్ద మొత్తంలో అభిమానులను సంపాదించుకున్నది. బిగ్ బాస్లోకి ప్రవేశించిన తర్వాత ఆమెకు ఫాలోవర్లు మరింత పెరిగారు.