లక్నో: మహిళల రక్షణ కోసం ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు చేసినా మానవ మృగాల తీరు మారడంలేదు. నిత్యం ఎక్కడో ఒకచోట ఆడపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. కొత్తగా ఉత్తరప్రదేశ్లోని లక్నో సిటీలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. ట్యూషన్ నుంచి ఆటోలో ఇంటికి వెళ్తున్న 18 ఏండ్ల యువతిపై ఆటోడ్రైవర్, అతని స్నేహితుడు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
యువతి ఆటో ఎక్కగానే నిందితులు ఆటోను దారి మళ్లించారు. కొత్త దారిలో ఎందుకు వెళ్తున్నారని ఆమె ప్రశ్నించడంతో తీవ్రంగా కొట్టారు. ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి మూడు గంటలపాటు ఆమెపై అఘాయిత్యానికి ఒడిగట్టారు. ఆ తర్వాత పెట్రోల్ పంపులో పెట్రోల్ పోయించుకుని, యువతిని రోడ్డుపైకి తోసేసి పారిపోయారు.
ఆ తర్వాత అటుగా పోలీస్ వ్యాన్ రావడం గమనించిన యువతి జరిగిన సంగతి వారితో చెప్పింది. కానీ వాళ్లు తక్షణమే చర్యలు తీసుకోకుండా బాధితురాలిని ఇంటి దగ్గర దిగబెట్టారు. రేపు పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేయమని చెప్పి వెళ్లిపోయారు. మర్నాడు బాధితురాలు కుటుంబసభ్యులతో కలిసి పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది.
దాంతో పోలీసులు నిందితులపై ఇండియన్ పీనల్ కోడ్లోని సంబంధిత సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పరారీలో ఉన్న నిందితుల కోసం బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టారు. మరోవైపు, బాధితురాలు చెప్పిన వెంటనే నిందితుల కోసం గాలించకుండా ఆమెను ఇంటి దగ్గర దిగబెట్టి వెళ్లిన పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.