అమరావతి : ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉపాధ్యాయులకు ఇవాళ్టి నుంచి తీసుకొచ్చిన ఆన్లైన్ హాజరు విధానంలో సాంకేతిక సమస్యలు రావడంతో ఉపాధ్యాయులు ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ ఆధారిత హాజరు విధానం అనేక చోట్ల అందుబాటులోకి రాలేదు. యాప్ డౌన్లోడ్, ఫొటో అప్లోడ్ సమస్యను ఎదుర్కొన్నారు.
ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ను ఉపాధ్యాయులు తమ సెల్ ఫోన్లోనే డౌన్లోడ్ చేసుకుని, తమ ఫొటోలను అప్లోడ్ చేయాలి. ప్రతిరోజూ పాఠశాల వద్ద యాప్ ఓపెన్ చేసి, హాజరు నమోదు చేయాలి. ఉదయం 9 గంటల తర్వాత నిమిషం ఆలస్యమైనా సగం రోజు సెలవుగా పరిగణిస్తారు. ఉదయం పాఠశాలకు వచ్చినప్పుడు, సాయంత్రం తిరిగివెళ్లేటప్పుడు రెండు సార్లు హాజరు నమోదు చేయాలి. చాలా ప్రాంతాల్లో నెట్వర్క్ సౌకర్యం ఉండదని ఇలాంటి పరిస్థితుల్లో ఉపాధ్యాయుణ్ని దోషిగా నిలబెట్టడంపై పలు ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
కాగా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోవడం లేదని ఫ్యాప్టో ప్రకటించింది . ప్రభుత్వం తక్షణమే ఈ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ్టి నుంచి ఏపీటీఎఫ్, ఫ్యాప్టో ఉపాధ్యాయ సంఘాలు నిరసనలకు పిలుపునిచ్చాయి.. పాఠశాలల విలీన ప్రక్రియ ఉపసంహరించాలని, ఎన్నికల హామీ సీపీఎస్ రద్దు అమలు చేయాలని కోరుతున్నాయి.