మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్లు ఉంది మన దేశంలోని పౌర విమానయాన రంగం పరిస్థితి. అసలే కరోనాతో ఆర్థికంగా చితికిపోయి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దశలో వరుసగా సాంకేతిక సమస్యలు వెన్నాడుతున్నాయి. ఇటీవల కొంతకాలంగా పలు సంస్థల విమానాలు గగనతలంలో ఇంజిన్ ఫెయిల్యూర్, రాడార్ నిలిచిపోవటం, ఎలక్ట్రానిక్ పరికరాల మొరాయింపు, పక్షుల తాకిడి తదితర సమస్యలను ఎదుర్కొన్నాయి. ఫలితంగా ఆ విమానాలు గమ్యస్థానం వైపు వెళ్లకుండా తిరిగి వెనక్కి మళ్లటం, మార్గమధ్యంలోనే దిగటం వంటి ఘటనలు చోటు చేసుకున్నాయి. అదృష్టవశాత్తు ఏ సందర్భంలోనూ ప్రాణనష్టం జరుగలేదు. గత కొన్ని నెలల వ్యవధిలోనే ఇటువంటి ఘటనలు 21 వెలుగు చూశాయి. బయటపడని చిన్నాచితక ఘటనలు ఎన్నో ఎవరికీ తెలియదు.
స్పైస్జెట్, విస్తారా, ఇండిగో తదితర కంపెనీల విమానాల్లో ఈ సమస్యలు చోటుచేసుకున్నాయి. పౌర విమానయాన నియంత్రణ సంస్థ డీజీసీఏ రంగంలోకి దిగి ఆయా కంపెనీలకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సంబంధిత కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా స్పందిస్తూ.. ‘భద్రతకు సంబంధించిన అతిచిన్న లోపాలను కూడా వదిలిపెట్టవద్దు. పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపి పరిష్కరించాలి’ అంటూ ట్వీట్ చేశారు. ప్రమాదాలు జరగగానే హడావిడి చేయటం, ఆ తర్వాత మర్చిపోవటం మనదేశంలో సాధారణం. ఈ తరహా నిర్లక్ష్యం ప్రయాణికుల ప్రాణాలకే కాదు, పౌర విమానయాన రంగానికీ ఎంతమాత్రం మంచిది కాదు. పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇటీవల సమర్పించిన ఓ నివేదికలో, పౌర విమానయాన రంగం ఎదుర్కొంటున్న భద్రతపరమైన సవాళ్లను ప్రస్తావిస్తూ వాటి పరిష్కారానికి సూచనలు చేసింది. ముఖ్యంగా, విమానాల తనిఖీని ముమ్మరం చేయాలని పేర్కొంది.
కొత్త విమానాల రిజిస్ట్రేషన్ దగ్గరి నుంచి పైలట్లకు లైసెన్సులను జారీ చేయటం వరకూ ప్రతీ చిన్నా పెద్ద పని ప్రస్తుతం డీజీసీఏ పరిధిలోనే జరుగుతున్నది. దీనికితోడు విమాన ప్రమాదాలు, సాంకేతిక సమస్యలపై దర్యాప్తు కూడా ఆ సంస్థ పనే. ఇంత విస్తృతమైన బాధ్యతలున్న డీజీసీఏ సిబ్బంది, నిపుణుల కొరతతో సతమతమవుతున్నది. అటువంటప్పుడు, సమస్యలు ఎలా పరిష్కారమవుతాయి? 1990ల ఆఖరులో ప్రైవేటు కంపెనీలకు తలుపులు తెరిచిన తర్వాత భారత పౌర విమానయాన రంగం స్వరూపమే మారిపోయింది. ఊహాతీతంగా ఈ రంగం విస్తరించింది. మధ్యతరగతికీ విమాన ప్రయాణం అందుబాటులోకి వచ్చింది. దీనికి తగినట్లుగా నియంత్రణ, పర్యవేక్షణ విభాగాల్లో సంస్కరణలు చోటుచేసుకోలేదన్న విమర్శలున్నాయి. కరోనాతో ఆర్థికంగా కుదేలు కావటం, సిబ్బందిని తగ్గించుకోవటం, ఇంధనం ధరలు పెరుగటం, పోటీలో భాగం గా టికెట్ల ధరలను తగ్గించుకోవాల్సి రావటం వంటి పలు సమస్యలను ఎయిర్లైన్ సంస్థలు ఎదుర్కొంటున్నాయి. ఈ ప్రభావం భద్రతా ప్రమాణాలపైన కూడా పడుతున్నది. ఫలితమే వరుస ఘటనలు. ఈ పరిస్థితులను మార్చటానికి దీర్ఘకాలిక వ్యూహం, దిద్దుబాటు చర్యలు అవసరం. కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టాలి.