బెంగళూర్ : కర్నాటకకు చెందిన మాజీ పోలీస్ ఉన్నతాధికారి శంకర్ బిదారి ఈమెయిల్ ఐడీని హ్యాక్ చేసిన ముగ్గురు నాగాలాండ్ టెకీలను బెంగళూర్ పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి వారు నిర్వహిస్తున్న పలు బ్యాంకు ఖాతాలు, పత్రాలు, అద్దె ఒప్పందాలు, ఆధార్ కార్డులు, పాన్ కార్డులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వెబ్సైట్లను హ్యాకింగ్ చేయడంతో పాటు ఈశాన్య రాష్ట్రాల్లో నిరుద్యోగులను మోసం చేసేందుకు నకిలీ మానవ వనరుల కంపెనీని నిర్వహిస్తున్నారని పోలీసులు వెల్లడించారు. నిందితులను థియా సమంగ్ (31), సెరోప సెసై (27), ఎస్తర్ కన్యాక్ (28)లుగా గుర్తించారు.
నిందితులు మయన్మార్ బోర్డర్లోని మాన్ జిల్లాకు చెందిన వారని, ఎస్తర్ బెంగళూర్లో గత రెండేండ్లుగా బ్యూటీ సెలూన్ నిర్వహిస్తోందని పోలీసులు తెలిపారు. వీరు జేమ్స్, పీటర్లతో కలిసి సోషల్ మీడియా సైట్లలో ఫిషింగ్ దాడులకు పాల్పడ్డారని ప్రస్తుతం పరారీలో ఉన్న జేమ్స్, పీటర్ల కోసం గాలింపు చేపట్టామని పోలీసులు తెలిపారు. ఈ రాకెట్కు ఎస్తర్ ప్రధాన సూత్రధారిగా భావిస్తున్నామని చెప్పారు. ఆమెను హై ప్రొఫైల్ కంపెనీల్లో ఎంప్లాయ్మెంట్ అధికారిగా చూపి నిరుద్యోగులను మోసగించారని తెలిపారు. ఇక సమాజంలో పేరున్న వ్యక్తుల ఈ మెయిల్, సోషల్ మీడియా ఖాతాల ఐడీలను హ్యాక్ చేసి వారి పేర్లతో సోషల్ మీడియాల్లో ఖాతాలు తెరిచి ఫ్రెండ్స్ను డబ్బులు అడిగేవారని డిసీపీ శ్రీనాథ్ జోషి వెల్లడించారు. వీఐపీ స్నేహితులు ఇబ్బందుల్లో ఉన్నారని భావించి పలువురు వారి ఖాతాల్లోకి డబ్బు పంపేవారని వివరించారు. కర్నాటక మాజీ డీజీ, ఐజీపీ శంకర్ బిదారి నిందితుల బారినపడి ఫిషింగ్ దాడికి గురవడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది.