చెన్నై: పెళ్లి చేసుకునేందుకు డబ్బుల కోసం టెకీ జంట దొంగలుగా మారారు. చోరీకి ప్రయత్నించి పోలీసులకు దొరికిపోయారు. తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 23 ఏళ్ల దినేష్ కుమార్, 24 ఏళ్ల సేన్బగవల్లి అలియాస్ ప్రియా ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లు. టెకీలైన వీరిద్దరికి సోషల్ మీడియాలో పరిచయం ఏర్పడింది. దీంతో పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. అయితే పెళ్లి ఖర్చుల కోసం దొంగలుగా మారారు.
ఈ నెల 12న సాయంత్రం వేళ వాడవల్లి సమీపంలోని బొమ్మనంపాళయం గ్రామంలో నివాసం ఉంటున్న 76 ఏళ్ల ఆర్ పెరియ రాయప్పన్ ఇంటికి వెళ్లారు. దాహం వేస్తున్నదని తాగేందుకు మంచి నీరు అడిగారు. ఒక్కడే ఇంట్లో ఉన్నట్లు గ్రహించారు. ఆయన వెనుకే ఇంట్లోకి వెళ్లారు. ఆ వృద్ధుడ్ని కొట్టి తాడుతో కట్టేశారు. ఆ ఇంట్లో ఉన్న 18 గ్రాముల బంగారం, రూ.1,500 నగదు దోచుకున్నారు. అనంతరం అక్కడి నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు.
కాగా, అంతలో రాయప్పన్ పెద్ద కుమారుడు బాబు ఆ ఇంటికి వచ్చాడు. దినేష్ కుమార్, ప్రియా అక్కడి నుంచి పారిపోవడం చూసి కేకలు వేశాడు. దీంతో అప్రమత్తమైన పొరుగువారు వారిద్దరినీ పట్టుకున్నారు. పోలీసులకు సమాచారం ఇచ్చి వారికి అప్పగించారు. దీంతో వారిద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.
మరోవైపు దినేష్, ప్రియా ఈ నెల 4న కూడా ఇదే తరహాలో దొంగతనానికి పాల్పడినట్లు వాడవల్లి పోలీసులు తెలిపారు. ములై నగర్ సమీపంలో ఇంట్లో ఒంటరిగా నివసిస్తున్న వృద్ధురాలి నుంచి రూ.28,000 నగదు, మొబైల్ ఫోన్ను చోరీ చేసినట్లు చెప్పారు. ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్లైన ఇద్దరికీ ఇన్స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడిందని, దీంతో పెళ్లికి డబ్బుల కోసం వారిద్దరూ కలిసి దొంగతనాలు చేస్తున్నారని పోలీసులు వెల్లడించారు.