న్యూఢిల్లీ: టెక్ కంపెనీలైన గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్ లాంటివి తమ న్యూస్ ఆదాయంలో కొంత మొత్తాన్ని సాంప్రదాయ మీడియాకు చెల్లించాలంటూ ఇవాళ రాజ్యసభలో బీజేపీ ఎంపీ సుశీల్ కుమార్ మోదీ డిమాండ్ చేశారు. ప్రింట్ మీడియా తరహాలోనే న్యూస్ ఛానళ్లు కూడా చాలా దయనీయమైన దశలో ఉన్నాయన్నారు. టెక్ దిగ్గజ కంపెనీలు అయిన గూగుల్, ఫేస్బుక్, యూట్యూబ్ లాంటి వాటి వల్ల సాంప్రదాయ మీడియాకు గడ్డురోజులు ఎదురవుతున్నట్లు ఎంపీ సుశీల్ కుమార్ మోదీ ఆరోపించారు. టెక్ కంపెనీలే గత కొన్నాళ్ల నుంచి యాడ్లో వచ్చే ఆదాయాన్ని పోగు చేసుకుంటున్నట్లు తెలిపారు. దీని వల్లే సాంప్రదాయ మీడియా.. కష్టాలు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. అందుకే ఆస్ట్రేలియా తరహాలో చట్టాన్ని పాస్ చేయాలన్నారు. ఆస్ట్రేలియాలో గూగుల్ అక్కడి మీడియాను బెదిరించిందని, కానీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం వల్ల గూగుల్ దిగివచ్చిందన్నారు. యాడ్ ఆదాయంలో సాంప్రదాయ మీడియాకు వాటాను ఇచ్చేందుకు అంగీకరించిందన్నారు. గూగుల్ తన షేర్ను ట్రెడిషనల్ మీడియాకు ఇవ్వాలన్నారు.
న్యూస్ కాంటెంట్ను షేర్ చేస్తున్న టెక్ కంపెనీలు కచ్చితంగా తమ ఆదాయాన్ని మన మీడియాకు ఇవ్వాలన్నారు. వార్తల సేకరణ కోసం మీడియా కంపెనీలు భారీ స్థాయిలో పెట్టుబడులు పెడుతాయని, తద్వారా విశ్వసనీయమైన సమాచారాన్ని అవి అందిస్తుంటాయని, వాణిజ్య ప్రకటనల ద్వారానే వారికి ఆదాయం వస్తుందని, కానీ ప్రస్తుత దశలో భారీ మొత్తంలో ఆదాయం టెక్ కంపెనీలకు వెళ్తోందని, దీని వల్లే ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ఎంపీ సుశీల్ కుమార్ తెలిపారు. ఆస్ట్రేలియా తరహాలో ఫ్రాన్స్తో పాటు మరికొన్ని యూరోప్ దేశాలు గూగుల్ నియంత్రణ చట్టాలను చేస్తున్నట్లు చెప్పారు. వార్తలకు పేమెంట్ ఇచ్చే విధంగా గూగుల్ను నియంత్రించే చట్టాలను తీసుకురావానల్నారు.