కొండాపూర్/అమీర్పేట్, ఫిబ్రవరి 23: తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ సతీమణి, అమ్మల సంఘం వ్యవస్థాపక అధ్యక్షురాలు అల్లం పద్మ భౌతికకాయానికి బుధవారం అంతిమ వీడ్కోలు పలికారు. ఫిల్మ్నగర్లోని మహాప్రస్థానంలో నిర్వహించిన అంత్యక్రియలకు పలువురు ప్రజాప్రతినిధులు, మీడియారంగ ప్రముఖులు హాజరై కన్నీటి వీడ్కోలు పలికారు. పద్మ కిడ్నీ సంబంధ వ్యాధికి నిమ్స్ దవాఖానలో చికిత్స పొందుతూ మంగళవారం మృతిచెందగా, భౌతికకాయాన్ని బుధవారం ఉదయం సనత్నగర్ జెక్కాలనీలోని స్వగృహానికి తీసుకొచ్చారు. మంత్రులు కే తారకరామారావు, తలసాని శ్రీనివాస్యాదవ్, జగదీశ్రెడ్డి, మహమూద్ అలీ, రైతుబంధు సమన్వయ సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డితో పాటు నమస్తే తెలంగాణ సీఎండీ దీవకొండ దామోదర్రావు, ప్రముఖ వ్యాపారవేత్త లక్ష్మీరాజం దంపతులు, తెలంగాణ టుడే ఎడిటర్ శ్రీనివాస్రెడ్డి, సాక్షి ఎడిటర్ వర్దెల్లి మురళి, ఆంధ్రజ్యోతి ఎడిటర్ కే శ్రీనివాస్తో పాటు పలువురు ప్రముఖులు అల్లం పద్మ భౌతికకాయం వద్ద నివాళి అర్పించారు. ఎమ్మెల్యేలు క్రాంతికిరణ్, దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్సీలు నారదాసు లక్ష్మణ్రావు, బీ వెంకటేశ్వర్లు, కర్నె ప్రభాకర్, సీపీఐ నాయకులు కే నారాయణ, చాడ వెంకట్రెడ్డి, పీవోడబ్ల్యూ నాయకురాలు సంధ్య, సీఎం కార్యాలయ ఓఎస్డీ దేశపతి శ్రీనివాస్, రమేశ్హజారే, బుద్ధవనం ప్రాజెక్ట్ చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, టీఎస్పీఎస్సీ మాజీ చైర్మన్ ఘంటా చక్రపాణి, ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ దేవులపల్లి అమర్, వేదకుమార్, దేవీప్రసాద్, ఎంబీ కృష్ణయాదవ్, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు మారుతిసాగర్, బలరామ్, వెంకట్ (కూకట్పల్లి), చంద్రశేఖర్తోపాటు పలువురు తెలంగాణ ఉద్యమకారులు అల్లం పద్మ భౌతికకాయానికి నివాళులర్పించారు.