ముంబై: ఐసీసీ తొలిసారి ప్రారంభించిన వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ ఫస్ట్ ఎడిషన్లో అత్యంత నిలకడగా రాణించింది టీమిండియానే. అందరి కంటే ఎక్కువ విజయాలు, పాయింట్లతో టాప్ ప్లేస్లో ఫైనల్కు క్వాలిఫై అయినా.. అక్కడ న్యూజిలాండ్ జోరు ముందు నిలవలేకపోయింది. టెస్ట్ చాంపియన్షిప్ గదను కోల్పోయింది. ఇక ఇప్పుడు కోహ్లి సేన తర్వాతి వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్ కోసం సిద్ధమవుతోంది. ఇప్పటికే ఇండియన్ టీమ్ షెడ్యూల్ కూడా రిలీజైంది. ఆగస్ట్ 4 నుంచి ఇంగ్లండ్తో ప్రారంభమయ్యే ఐదు టెస్ట్ల సిరీసే ఇందులో మొదటిది. 2021-23 మధ్య జరగనున్న టెస్ట్ చాంపియన్షిప్లో ఇండియా షెడ్యూల్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం.
ఇంగ్లండ్ టూర్ 2021
ఆగస్ట్ 4-8 తొలి టెస్ట్, ఆగస్ట్ 12-16 రెండో టెస్ట్, ఆగస్ట్ 25-29 మూడో టెస్ట్, సెప్టెంబర్ 2-6 నాలుగో టెస్ట్, సెప్టెంబర్ 10-14 ఐదో టెస్ట్.
ఇండియాలో న్యూజిలాండ్ టూర్ 2021
డబ్ల్యూటీసీ ఫైనల్లో ఇండియాను ఓడించిన న్యూజిలాండ్ ఈ ఏడాది నవంబర్లో ఇక్కడికి వస్తోంది. రెండు టెస్ట్ల సిరీస్లో కోహ్లి సేనతో తలపడనుంది. తొలి డబ్ల్యూటీసీలో టీమిండియా మొత్తం 5 టెస్టులు ఓడగా.. అందులో మూడు న్యూజిలాండ్తోనే కావడం గమనార్హం. ఇప్పుడు దానికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం దక్కుతోంది.
సౌతాఫ్రికాలో ఇండియా టూర్ 2021-22
ఇండియా ఇప్పటి వరకూ టెస్ట్ సిరీస్ గెలవని దేశం సౌతాఫ్రికానే. ఈసారి ఆ ముచ్చట కూడా తీర్చుకునే అవకాశం కోహ్లి సేనకు వస్తోంది. ప్రస్తుతం ఆ టీమ్ అంత బలంగా లేదు. ఇలాంటి సమయంలో మూడు టెస్ట్ల సిరీస్ కోసం ఈ ఏడాది డిసెంబర్లో సౌతాఫ్రికా వెళ్తోంది టీమిండియా.
ఇండియాలో శ్రీలంక టూర్ 2022
వచ్చే ఏడాది ఐపీఎల్ ప్రారంభానికి ముందు ఇండియాలో మూడు టెస్ట్ల సిరీస్ కోసం శ్రీలంక వస్తోంది. సొంతగడ్డపై ఈ సిరీస్ గెలవడం ఇండియన్ టీమ్కు పెద్ద కష్టం కాకపోవచ్చు.
ఇండియాలో ఆస్ట్రేలియా టూర్ 2022
2020-21లో ఆస్ట్రేలియా టూర్కు వెళ్లిన టీమిండియా అక్కడ టెస్ట్ సిరీస్లో చారిత్రక విజయం సాధించింది. అంతకుముందు టూర్లోనూ ఆ టీమ్ను మట్టి కరిపించింది. ఇప్పుడు టీమిండియాపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఆస్ట్రేలియా వస్తోంది. 2022 అక్టోబర్-నవంబర్లలో నాలుగు టెస్ట్ల కోసం ఆస్ట్రేలియా రానుంది.
బంగ్లాదేశ్లో ఇండియా టూర్ 2022
వరల్డ్ టెస్ట్ చాంపియన్షిప్లో భాగంగా కోహ్లి సేన ఆడే చివరి టెస్ట్ సిరీస్ ఇదే. 2022 చివర్లో రెండు టెస్ట్ల సిరీస్ కోసం ఇండియన్ టీమ్ బంగ్లాదేశ్లో పర్యటించనుంది.