హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 27 (నమస్తే తెలంగాణ): ‘ప్రారంభోత్సవం అంటే రిబ్బన్ కట్ చేయడం, దీపాలు వెలిగించడం.. ఇలా చాలా సాధారణంగా ఉంటుంది. కానీ టీహబ్ ప్రారంభోత్సవాన్ని మాత్రం ఎంతో వైవిధ్యంగా నిర్వహిస్తున్నాం. స్టార్టప్ రంగంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన టీహబ్ కొత్త భవనం ప్రారంభోత్సవానికి దేశంలోని 25 యూనికార్న్ స్టార్టప్ కంపెనీల ప్రతినిధులను ఆహ్వానిస్తున్నాం. వారితో ఒక రోజంతా ప్రత్యేకంగా టీహబ్లోని స్టార్టప్లతో సమావేశాలు నిర్వహిస్తాం. అదేవిధంగా స్టార్టప్లలో పెట్టుబడులు పెట్టే వెంచర్ క్యాపిటలిస్టులు 50 మందిని ఆహ్వానించగా, 30 మంది వరకు హాజరవుతున్నారు..’ అని రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు. దేశ,విదేశాలకు చెందిన ఐటీ రంగ నిపుణులతో పాటు సిలికాన్ వ్యాలీకి చెందిన ప్రతినిధులు వర్చువల్గా పాల్గొంటారని తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడిన జయేశ్ రంజన్ టీ హబ్ 2.0 ప్రత్యేకతలను వివరించారు.
మొదటి అంతస్థు వెంచర్ క్యాపిటలిస్టుల కోసమే…
స్టార్టప్ ఎకోసిస్టంలో ఎంతో కీలకమైన వెంచర్ క్యాపిటలిస్టుల కోసం టీహబ్ కొత్త భవనంలో మొదటి అంతస్థును పూర్తిగా కేటాయించామని జయేశ్ రంజన్ వివరించారు. స్టార్టప్ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టే వారంతా ఎక్కువగా బెంగళూరు, ఢిల్లీ, గుర్గావ్ ప్రాంతాల్లోనే ఉంటున్నారని చెప్పారు. వెంచర్ క్యాపిటలిస్టుల ఆఫీసు కార్యకలాపాలకు అవసరమైన స్థలాన్ని టీహబ్లో ఉచితంగా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. టీహబ్ కార్యకలాపాలను హైదరాబాద్ నగరానికి పరిమితం చేయకుండా, రాష్ట్రంలో మరో ఐదు చోట్ల రీజినల్ సెంటర్లను ఏర్పాటు చేస్తామని జయేశ్ రంజన్ తెలిపారు. వరంగల్, కరీంనగర్, ఖమ్మం, నిజామాబాద్, మహబూబ్నగర్ ప్రాంతాల్లో వాటిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. రీజినల్ సెంటర్లలోనూ స్టార్టప్లను ప్రోత్సహించేలా కార్యక్రమాలు చేపడుతామని పేర్కొన్నారు.
జూలై 1 నుంచి కొత్త భవనంలోకి..
ప్రస్తుతం గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ఉన్న టీహబ్ను జూలై 1 నుంచి పూర్తిస్థాయిలో కొత్తగా నిర్మించిన భవనంలోకి మారుస్తామని జయేశ్ రంజన్ తెలిపారు. ఖాళీ అయిన పాత భవనాన్ని ట్రిపుల్ఐటీ సంస్థకు అప్పగిస్తామని చెప్పారు. 2015లో ప్రారంభమైన టీహబ్లో ఇప్పటివరకు 1,100 స్టార్టప్లకు స్థానం కల్పించగా, అందులో మూడు యూనికార్న్ కంపెనీలుగా ఎదిగాయని వెల్లడించారు. మరో 8 కంపెనీలు సూనికార్న్ కంపెనీలుగా వృద్ధి చెందాయని వివరించారు. ఇక్కడి స్టార్టప్లకు నిధుల రూపంలో రూ.10వేల కోట్లు వచ్చాయని చెప్పారు. పాత టీహబ్లో ఉన్న 215 స్టార్టప్లను జూలై 1 నుంచి కొత్త భవనం నుంచే తమ కార్యకలాపాలను నిర్వహిస్తాయని జయేశ్ రంజన్ పేర్కొన్నారు.
ప్రారంభోత్సవం రోజే 32 కార్యక్రమాలు
ప్రపంచంలోనే రెండో అతిపెద్ద స్టార్టప్ ఇంక్యుబేషన్ సెంటర్ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన టీహబ్ను రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రారంభించనున్నారు. టీహబ్ భవన నిర్మాణాన్ని, అక్కడి మౌలికవసతులను సీఎం ప్రత్యేకంగా పరిశీలించనున్నారు. అనంతరం పరిమిత సంఖ్యలో హాజరయ్యే అతిథులను ఉద్దేశించి కేసీఆర్ ప్రసంగించనున్నారు. ఇందుకోసం ఐటీ కారిడార్లో ప్రత్యేకంగా ఏర్పాట్లు చేశారు. టీహబ్ ప్రారంభోత్సవాన్ని ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా స్టార్టప్ రంగానికి సంబంధించిన వందలాది నిపుణులతో ప్రత్యేకంగా కార్యక్రమాలను నిర్వహించనున్నారు.
ఒక్కరోజే 32 వేర్వేరు కార్యక్రమాలను వివిధ అంశాలపై నిర్వహించేలా టీహబ్ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా మెటావర్స్, వెబ్ 3.0,ఎమర్జింగ్ టెక్నాలజీ, ఆపర్చునిటీ హైదరాబాద్, బిల్డింగ్ ఏ యూనికార్న్, టీహబ్ టాక్స్, ఫైర్ సైడ్చాట్, ప్యానల్ డిస్కషన్స్, మెడ్టెక్, బిల్డింగ్ ఫర్ నెక్స్ బిలియన్, ఓపెన్ ఇన్నోవేషన్, బిల్డింగ్ ఫండ్ ఫర్ ఎర్లీస్టేజ్ డీప్టెక్ స్టార్టప్స్, మొబిలిటీ-ద ప్యూచర్, మాస్టర్ క్లాసెస్.. ఇలా మొత్తం 32 అంశాలపై ఐటీ రంగం, స్టార్టప్ రంగానికి చెందిన నిపుణులతో కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఉదయం 8.30 గంటలకు మొదలై మధ్యాహ్నం 4 గంటల వరకు ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి.ప్రారంభ కార్యక్రమంలో సినీ హీరో రానా దగ్గుబాటి కీలకోపన్యాసం చేయనున్నారు.