కృత్రిమ మేధ, బిగ్ డేటా, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, త్రీడీ ప్రింటింగ్, బ్లాక్చెయిన్ వంటి నవ్య సాంకేతికతలు ప్రపంచ గతిని మార్చేస్తున్నాయి. విద్యారంగంలోనూ ఆన్లైన్ బోధన విస్తృతమైంది. ఈ క్రమంలో దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్లోని ఒక పాఠశాల రోబో టీచర్లతో బోధిస్తూ నూతన చర్చకు తెరతీసింది. అయితే వీటి వినియోగంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇవి ఉపాధ్యాయులకు ప్రత్యామ్నాయం కాగలవా అనే ఆసక్తికర చర్చ సాగుతున్నది.
టీచింగ్ రోబోలు 5 నుంచి 11వ తరగతుల విద్యార్థులకు 30కు పైగా భాషల్లో పాఠాలు చెప్పగలవు. రోబో చెప్పే పాఠాలను విద్యార్థులు మొబైల్స్, ల్యాప్టాప్ల ద్వారా వినే సౌకర్యం కూడా ఉన్నది. టీచర్ల కొరత, టీచర్లపై పనిభారం ఉన్నచోట ఈ రోబోల వినియోగం వల్ల చాలా మేలు కలుగుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు. భారత్లో 11 లక్షల పైగా ఉపాధ్యాయుల ఖాళీలున్నట్లు ‘యునెస్కో స్టేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ఫర్ ఇండియా’ నివేదిక స్పష్టం చేసింది. దేశంలో దాదాపు 1.2 లక్షల ఏకోపాధ్యాయ పాఠశాలలున్నా యి. యుడైస్ నివేదిక సైతం ఉపాధ్యాయుల అవసరాన్ని నొక్కి చెప్పింది. ప్రైవేట్ పాఠశాలలతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉన్నది. దేశవ్యాప్తంగా పలు రాష్ర్టాల్లో ప్రభుత్వ ఉపాధ్యాయుల నియామకం మందకొడిగా సాగుతున్నది. దీంతో విద్యార్థులకు నాణ్యమైన బోధన అందక చదువులో వెనుకబడుతున్నారు. ఈ క్రమంలో రోబో టీచర్లు అవసరమే అనిపిస్తున్నది. ఈ రోబోల గురించి తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సైతం వివరించడంతో ప్రభుత్వ పాఠశాలల్లో రోబోలను ప్రవేశపెట్టడంపై చర్చ జరుగుతున్నది.
నేటి ఆధునికయుగంలో పలురంగాల్లో రోబోల వినియోగం పెరిగింది. ఇప్పటికే కొన్ని హోటళ్లు రోబోలతో సేవలందిస్తూ వ్యాపారాన్ని పెంచుకుంటున్నాయి. ప్రపంచంలోని అభివృద్ధి చెందిన దేశాలు రోబో యంత్రాలతో విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నాయి. కంపెనీల్లో మానవ న్యాయవాదుల స్థానంలో రోబో వకీళ్లు రంగప్రవేశం చేశాయి. వైద్యరంగంలో రోబోటిక్ శస్త్రచికిత్సలు విస్తృత ప్రాచుర్యం పొందాయి. ట్రాఫిక్ నియంత్రణలోనూ వీటి వినియోగం పెరిగింది. ఈ క్రమంలోనే విద్యారంగంలోనూ వీటిని ఎందు కు వినియోగించకూడదన్న చర్చ మొదలైంది. అయితే బోధన అనేది విద్యార్థుల భావోద్వేగాలతో ముడిపడిన అంశం. పైగా పాఠాలను కొన్నిసార్లు కథల వలె వారి మనస్సుకు హత్తుకునేలా చెప్పాలి. ఈ బాధ్యతను రోబోలు ఎంత సమర్థంగా నిర్వహిస్తాయనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు ప్రస్తుతం విద్యావ్యవస్థలో రోబోలను వినియోగిస్తే ఇక టీచర్ల భవిష్యత్తు ఏమిటనే ప్రశ్న అందరినీ వేధిస్తున్నది. ఏ రంగంలోనైనా సాంకేతికతను వినియోగిస్తున్నప్పుడు పలు అనుమానాలు తలెత్తడంలో సందేహం లేదు. కాబట్టి టీచింగ్ రోబోలను క్షేత్ర స్థాయిలో పూర్తి సామర్థ్యంతో పరీక్షించిన తర్వాతనే ఒక అభిప్రాయానికి రావాల్సి ఉంటుంది. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న సాంకేతికత సౌలభ్యాన్ని ఉపాధ్యాయ వృత్తికి అవరోధంగా భావించకూడదు.
తరగతి గది బోధనలో టీచంగ్ రోబోలు ఉపాధ్యాయులకు దోహదకారి కావచ్చు. మన దేశంలో రోబో సాంకేతికత అభివృద్ధి చెందినప్పటికీ క్షేత్రస్థాయిలో అంతగా వినియోగంలో లేవు. మేధస్సుతో పాటు భావోద్వేగ ప్రజ్ఞ ఉంటేనే వృత్తి ఉద్యోగాల్లో, సామాజిక జీవితంలో రాణించడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం రోబోలు యాంత్రికంగా పాఠాలు బోధిస్తా యి తప్ప, సృజనాత్మకతతో బోధించలేవు. కాబట్టి ఉపాధ్యాయులు తమ ఉద్యోగ భద్రత గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
5జీ సాంకేతికత త్వరలోనే అందుబాటులోకి రానున్నది. ఇది కృత్రిమ మేధ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ వంటి నవ్య సాంకేతికతలు బాగా పనిచేయడానికి దోహదపడుతుంది. రోబోలకు 5జీ సాంకేతికత అనుసంధానిస్తే అవి ఆలోచనతో బోధించగలవని సాంకేతిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ టీచింగ్ రోబోలు అత్యాధునిక సాంకేతికతలతో కూడినవి కావడంతో ధరలు అధికంగా ఉంటాయి. వాటిని ఉపయోగించడం లో నైతికత సమస్యగా మారవచ్చు. విద్యావ్యవస్థలో ఏ సాంకేతికత కూడా గురువుకు ప్రత్యామ్నాయం కాదు. సృజనాత్మకత, నైపుణ్యం, నవీకరణ తో ముందుకెళ్లే ఉపాధ్యాయుడికి మంచి భవిష్యత్తు ఉంటుంది. చదువులో విశ్లేషణాశక్తి, విమర్శనాత్మక ఆలోచన, తర్కం, సమస్యా పరిష్కార జ్ఞానాన్ని రోబోలు చూపలేవు. సాంకేతిక, వ్యవస్థాపక నైపుణ్యాలు గలవారు మాత్రమే రేపటి వృత్తి, వ్యాపారాల్లో బాగా రాణించగలరు. ఇది ఉపాధ్యాయ వృత్తికి సైతం వర్తిస్తుంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉపాధ్యాయులు మరింత సాంకేతిక నైపుణ్యా లు, సృజనాత్మక పద్ధతులతో తమ బోధనకు మెరుగులు దిద్దుకోవాలి.
సంపతి రమేష్ మహారాజ్: 99595 56367