హైదరాబాద్, మార్చి 22 (నమస్తే తెలంగాణ): ఉపాధ్యాయ లోకం ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న టీచర్ల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ త్వరలోనే మొదలుకానున్నది. పాత జిల్లాల ప్రాతిపదికనే వీటిని చేపట్టనున్నట్టు సీఎం కేసీఆర్ సోమవారం అసెంబ్లీలో ప్రకటించారు. గత జనవరిలోనే టీచర్ల పదోన్నతులకు విద్యాశాఖ కసరత్తు చేసింది. కానీ, కొత్త జిల్లాల ఆధారంగానా.. లేక పాత 10 జిల్లాల ప్రాతిపదికన చేపట్టాలా? అనే సమస్య తలెత్తింది. ఏకీకృత సర్వీసు రూల్స్పై కేసు కోర్టులో ఉండటమూ ప్రతిబంధకమైంది. 2016లో ఉపాధ్యాయ బదిలీలు చేపట్టగా, ఉమ్మడి సర్వీసు రూల్స్ కారణంగా బదిలీలు, పదోన్నతులు నిలిచిపోయాయి.
ఈ దశలోనే కొత్త జిల్లాల ఏర్పాటుతో చాలామంది ఉపాధ్యాయులు ఆర్డర్ టు సర్వ్ విధానంలో పనిచేస్తున్నారు. వీరంతా పదోన్నతులు, బదిలీల కోసం వేచిచూస్తున్నారు. తాజాగా పాత జిల్లాల ప్రాతిపదికనే ప్రక్రియను చేపట్టనుండటంతో బదిలీలు, పదోన్నతులకు అవకాశం ఏర్పడనున్నది. ప్రభుత్వ, స్థానిక సంస్థల యా జమాన్యాల ప్రకారమే చేపట్టనుండటంతో అడ్డంకులన్నీ తొలిగిపోనున్నాయి. అంతర్ జిల్లా బదిలీలకూ అనుమతి నివ్వడంతో మరో 300 మందికి లబ్ధి కలుగనున్నది.
కాంట్రాక్ట్ అధ్యాపకులకు భారీగా పెంపు
ఇంటర్, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అధ్యాపకులకు తెలంగాణ వచ్చేనాటికి 18 వేలే ఇచ్చేవారు. రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంటర్వారికి రూ.37,100, డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలవారికి రూ.42 వేలకు పెంచారు. తాజా పీఆర్సీతో జూనియర్ అధ్యాపకులకు రూ.60 వేలకు, డిగ్రీ, పాలిటెక్నిక్ అధ్యాపకులకు రూ.65 వేలకు పెరుగుతుందని అంచనా.
కేజీబీవీ ఉద్యోగినులకు ప్రసూతి సెలవులు
కస్తుర్బాగాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగినుల కు రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించింది. వారికి వేతనాలు పెంచడంతోపాటు 180 రోజుల వేతనంతో కూడిన ప్రసూతి సెలవులు ఇవ్వనున్నట్టు ప్రకటించింది. దాంతో 475 కేజీబీవీల్లోని 8,550 మంది బోధన, 5 వేలమంది బోధనేతర సిబ్బందికి లబ్ధికలుగుతుంది. కేజీబీవీల్లో ఉద్యోగాలన్నీ మహిళలకే కేటాయించిన విషయం తెలిసిందే. చాలా ప్రభుత్వ విభాగాల్లో రెగ్యులర్, ఔట్సోర్సింగ్ మహి ళా ఉద్యోగులకు ఇప్పటికే వేతనాలతో కూడిన ప్రసూతి సెలవులు ఇస్తున్నారు. తాజాగా సీఎం నిర్ణయం పట్ల పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పింగిలి శ్రీపాల్రెడ్డి, బీరెల్లి కమలాకర్రావు హర్షం వ్యక్తం చేయడంతోపాటు కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
విద్యావలంటీర్లకు రూ.18వేలు
పీఆర్సీ ప్రకటనతో ప్రభుత్వ స్కూళ్లలో పనిచేస్తున్న విద్యావలంటీర్ల వేతనాలు పెరగనున్నాయి. ప్రాథమిక లెక్క ప్రకారం వీరి వేతనాలు రూ.18 వేలకు పెరిగే అవకాశం ఉన్నదని తెలుస్తున్నది. వీరికి ఉమ్మడి రాష్ట్రంలో నెలకు రూ.1,500 నుంచి రూ. 8 వేలలోపే ఇచ్చేవారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం వారి వేతనాలను రూ.12 వేలకు పెంచింది. తాజా ఫిట్మెంట్తో 16,300 మంది విద్యావలంటీర్లు లబ్ధిపొందనున్నారంటూ విద్యావలంటీర్ల సంఘం అధ్యక్షుడు మఠం శివానందస్వామి హర్షం వ్యక్తంచేశారు.