చండీగఢ్ : జన్మ నక్షత్రం రీత్యా ఏర్పడినమాంగల్య దోషాన్ని అధిగమించేందుకు ఓ టీచర్ 13 ఏండ్ల బాలుడిని పెండ్లి చేసుకున్న ఘటన పంజాబ్లోని జలంధర్ పట్టణంలో బస్తీ బవఖేల్ ప్రాంతంలో వెలుగుచూసింది. ఓ పండితుడు తనకు మాంగళ్య దోషం ఉందని చెప్పడంతో తన పెండ్లి గురించి కుటుంబసభ్యులు ఆందోళన చెందేవారని మహిళ పోలీసులకు వివరించింది. ఈ దోషాన్ని పోగొట్టుకునేందుకు మైనర్ బాలుడితో పెండ్లి తంతు జరిపించాలని ఆయన సూచించారని తెలిపారు. మహిళ వద్ద ట్యూషన్కు వచ్చే పిల్లల్లో ఒకడైన 13 ఏండ్ల బాలుడిని పెండ్లి కొడుకుగా ఎంపిక చేసుకున్నారు. ట్యూషన్ల కోసం వారం రోజుల పాటు బాలుడిని తమ ఇంట్లో ఉంచాలని ఆమె బాధితుడి తల్లితండ్రులను కోరింది. బాలుడు ఇంటికి తిరిగివచ్చి అక్కడ జరిగిన తంతును వివరించడంతో ఈ విషయం వెలుగుచూసింది.
బాలుడి తల్లితండ్రులు దీనిపై స్ధానిక పోలీసులను ఆశ్రయించారు. మహిళ కుటుంబ సభ్యులు బలవంతంగా హల్దీ-మెహందీ వేడుకలను నిర్వహించడంతో పాటు శోభనం జరిపారని ఆపై టీచర్ గాజులను పగులగొట్టి ఆమెను విధవగా ప్రకటించారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాలుడి తల్లితండ్రులు తెలిపారు. ఈ తంతు ముగించేందుకు మహిళ కుటుంబ సభ్యులు సంతాప సమావేశాన్ని కూడా నిర్వహించారు. మరోవైపు బాలుడి తల్లితండ్రులను మహిళ కుటుంబ సభ్యులు బలవంతంగా ఫిర్యాదును వెనక్కితీసుకునేలా చేశారు. ఫిర్యాదుదారు తన కేసును ఉపసంహరించారని స్ధానిక పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ గగన్దీప్ సింగ్ సెఖాన్ నిర్ధారించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన సీనియర్ పోలీస్ అధికారులు ఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.