Teacher arrested with heroin | పిల్లలకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఓ టీచర్ దారి తప్పాడు. విదేశాల నుంచి డ్రగ్స్ రవాణా చేయబోయి బెంగళూరులో రెవెన్యూ ఇంటెలిజెన్స్ డైరెక్టరేట్ (డీఆర్ఐ) అధికారులకు చిక్కాడు. అతడు 14 కిలోల హెరాయిన్ తరలిస్తుండగా ఈ నెల 19న బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం (కేఐఏ)లో డీఆర్ఐ అధికారులు అరెస్ట్ చేశారు. అడ్డీస్ అబాబా నుంచి సదరు వ్యక్తి తరలిస్తున్న హెరాయిన్ విలువ రూ.99 కోట్లు ఉంటుందని తెలిపారు.
ఆన్లైన్ జాబ్ సెర్చ్లో భాగంగా ఇథోపియాకు వెళ్లిన సదరు వ్యక్తి తిరుగు ప్రయాణంలో రెండు ట్రాలీ బ్యాగ్ల లోపల ప్రత్యేకంగా తయారు చేసిన ప్యాకెట్లలో హెరాయిన్ తీసుకొచ్చాడు. అడ్డీస్ అబాబా నుంచి బెంగళూరు మీదుగా ఢిల్లీకి డ్రగ్స్ ఒక వ్యక్తి తరలిస్తున్నాడని సమాచారం అందడంతో డీఆర్ఐ అధికారులు నిఘా పెట్టారు. నిందితుడిని తెలంగాణకు చెందిన ఒక టీచర్ (52) గా గుర్తించారు.
దీంతో ఈ నెల 19న కేఐఏ విమానాశ్రయంలో నిఘా పెట్టిన డీఆర్ఐ అధికారులు.. ఇథోపియన్ ఎయిర్లైన్స్ విమానం రాగానే భారత పాస్పోర్ట్ గలిగిన వ్యక్తిని, ఆయన లగేజీని తనిఖీలు చేశారు. కంప్యూటర్ స్కానర్లకు చిక్కకుండా నల్లని టేప్తో కప్పేసిన రెండు బ్రౌన్ పాకెట్లలో హెరాయిన్ ఉంది. ఆ హెరాయిన్ ప్యాకెట్లను ట్రాలీ బ్యాగ్ల దిగువన అమర్చాడు. సదరు ప్యాకెట్లను కత్తిరించి పరిశీలించడంతో 14 కిలోల హెరాయిన్ బయటపడింది. అంతర్జాతీయ మార్కెట్లో కిలో రూ.7 కోట్లపైనే పలుకుతుందని డీఆర్ఐ అధికారులు చెప్పారు. మొత్తం హెరాయిన్ విలువ దాదాపు రూ.99 కోట్లు ఉంటుందన్నారు.
డీఆర్ఐ అధికారుల దర్యాప్తులో తాను ఇంటి వద్ద పిల్లలకు ట్యూషన్లు చెబుతున్నట్లు తెలిపాడు. కొన్ని నెలల క్రితం ఆన్లైన్లో జాబ్ కోసం వెతికానని కూడా చెప్పాడు. విదేశాలకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని అందులో పేర్కొన్నారని, తనకు వచ్చిన ఫోన్ నంబర్కు కాంటాక్ట్ చేస్తే అడ్డీస్ అబాబాలో ఒకరు రిసీవ్ చేసుకున్నాడని అన్నాడు. ఇథోపియా నుంచి డ్రగ్స్ రవాణా చేసేందుకు ఒప్పందం కుదిరింది.
బెంగళూరులో యదేచ్ఛగా సాగుతున్న డ్రగ్స్ వ్యాపారంపై యాంటీ నార్కొటిక్, ఇతర దర్యాప్తు సంస్థల నిఘా పెరిగింది. ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే వారు అనుమానితులుగా ఉండటంతో విదేశాల నుంచి డ్రగ్స్ రవాణా చేయడానికి భారతీయుల వైపు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలు దృష్టి సారించాయి.