హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 28 (నమస్తే తెలంగాణ): టీ హబ్తో పాటు తెలంగాణ ప్రభుత్వం మరో రెండు ప్రాజెక్టులను ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్నది. అందులో ఒకటి టీ వర్క్స్, రెండోది ఇమేజ్ టవర్. సాఫ్ట్వేర్ అప్లికేషన్ల విభాగంలోనే కాదు హర్డ్వేర్ విభాగంలోనూ సరికొత్త ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు టీ వర్క్స్ను ఏర్పాటుచేసింది. దీని భవనాన్ని టీ హబ్ పక్కనే చేపట్టారు. వీలైనంత త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేసి, ఆగస్టులో టీ వర్క్స్ను ప్రారంభించేందుకు ఐటీ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఇంటింటా ఇన్నోవేటర్ పేరుతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. ఎవరైనా ఉత్పత్తులను తయారు చేయాలంటే టీ వర్క్స్లో అవకాశం కల్పిస్తారు. దానితో పాటు ఐటీ రంగంలోనే ప్రత్యేకంగా యానిమేషన్, మల్టీమీడియా, గ్రాఫిక్స్ తదితర విభాగాలకు సంబంధించిన కార్యకలాపాలు ఒకేచోట జరిగేలా ఇమేజ్ పేరుతో ప్రత్యేక భవనాన్ని ప్రభుత్వం నిర్మిస్తున్నది. సినిమా, సీరియల్స్, వెబ్ సిరీస్.. వివిధ రంగాల మీడియాలకు అవసరమైన సేవలు అందించేందుకు వేదికగా ఇది నిలవనున్నది. ఈ భవన నిర్మాణం వచ్చే ఏడాది ప్రారంభిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు.