అమరావతి : వైఎస్సార్ కడప జిల్లాలో జరుగుతున్న బద్వేల్ ఉప ఎన్నికపై తెలుగుదేశం పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఉప ఎన్నికకు దూరంగా ఉండాలని నిర్ణయానికి వచ్చింది. ఆదివారం జరిగిన పొలిట్ బ్యూరో సమావేశంలో ఉప ఎన్నికల్లో పోటీ చేయకూడదని నేతలు తీర్మానించారు. చంద్రబాబు ఆధ్వర్యంలో పొలిట్ బ్యూరో సమావేశమై ఎన్నికల్లో పోటీ చేయాలా? వద్దా? అనే అంశంపై చర్చించింది. బద్వేల్ నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీకి చెందిన ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతి చెందగా.. ఉప ఎన్నిక అనివార్యమైంది.
అధికార పార్టీ మళ్లీ ఉప ఎన్నికల్లో ఆయన భార్యకు టికెట్ ఇవ్వడంతో పునరాలోచనలో పడిన టీడీపీ.. పోటీకి విముఖ వ్యక్తం చేస్తున్నది. సంప్రదాయాలు గౌరవించి.. ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రతిపక్ష టీడీపీ పేర్కొంది. అయితే, ఇంతకు ముందు టీడీపీ అభ్యర్థిగా రాజశేఖర్ను అధిష్ఠానం ఖరారు చేసింది. 2019లో టీడీపీ తరఫున ఓబులాపురం రాజశేఖర్ పోటీ చేయగా.. పొలిట్ బ్యూరో సభ్యుల సూచనతో ఉప ఎన్నిక నుంచి తప్పుకున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే జనసేన సైతం పోటీ నుంచి తప్పుకున్నది. కడపలో బీజేపీ నేతలు సమావేశమై.. పోటీ చేయాలని నిర్ణయానికి వచ్చారు. ఈ నెల 30న ఉప ఎన్నికల పోలింగ్ జరుగనుండగా.. నవంబర్ 2న ఓట్ల లెక్కింపు జరుగనుంది.