విశాఖపట్నం: విజయవాడలోని ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరును మార్చడాన్ని నిరసిస్తూ అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ రిలీ నిరాహార దీక్షలు చేపట్టింది. పేరు మార్చడం వల్ల ఎన్టీఆర్ను తీవ్రంగా అవమానించారని, ఎన్టీఆర్ పేరునే కొనసాగించాలంటూ టీడీపీ నేతలు నినాదాలు చేశారు. తమ డిమాండ్ పరిష్కారమయ్యేంత వరకు రిలీ దీక్షలు కొనసాగుతాయని టీడీపీ నేతలు చెప్పారు.
డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరు మార్చడాన్ని నిరసిస్తూ అనకాపల్లిలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, అనకాపల్లి నియోజకవర్గ పరిశీలకుడు బొర్రా నాగరాజు తదితరులు దీక్ష ప్రాంగణాన్ని సందర్శించారు. రాష్ట్రంలో ఒక్క మెడికల్ కాలేజీని కూడా తీసుకురాని వైసీపీ ప్రభుత్వానికి యూనివర్సిటీ పేరు మార్చే నైతిక హక్కు లేదన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునే వరకు తమ నిరసన కొనసాగుతుందని దీక్షలో ఉన్నవారు స్పష్టం చేశారు.
మాజీ ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ యూనివర్శిటీ పేరును మార్చడం ద్వారా ఎన్టీఆర్ కీర్తిని దెబ్బతీయలేరన్నారు. అధికార పార్టీ వైఖరిని రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. అంతకు ముందు ఎన్టీఆర్ విగ్రహానికి టీడీపీ నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దీక్షకు పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు హాజరయ్యారు.