అమరావతి : చిత్తూరు మాజీ మేయర్ కఠారి హేమలతపై పోలీసులు ప్రవర్తించిన తీరును టీడీపీ ఏపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. హేమలతపై పోలీసు జీపును ఎక్కించి తీవ్రంగా గాయపర్చిన ఘటనపై టీడీపీ అధినేత చంద్రబాబు, ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఏపీ సీఎం జగన్ అండతో పోలీసులు రెచ్చిపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పోలీసులు వైసీపీ కార్యకర్తల్లా మారి తప్పులు చేస్తున్నారని ఆరోపించారు. టీడీపీ అధికారంలోకి రాగానే తప్పులు చేసిన ప్రతి అధికారిపై చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జగన్ దయా దాక్షిణ్యాల కోసం కొందరు పోలీసులు దిగజారి అరాచకాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నిస్తే చంపేందుకు కూడా ప్రభుత్వం వెనకాడటం లేదని అచ్చెన్నాయుడు ఆరోపించారు.
అధికారపార్టీ అరాచకాలకు పోలీసులు వత్తాసు పలుకుతున్నారనడానికి ఈ ఘటనే నిదర్శనమన్నారు. హత్య కేసులో సాక్షులకు రక్షణ కల్పించాలని హేమలత డిమాండ్ చేయడమే నేరమా అనిలోకేష్ ప్రశ్నించారు.