మంగళగిరి: పోలీసుల వైఖరిని నిరసిస్తూ ఏపీ డీజీపీ కార్యాలయం వద్ద టీడీపీ ఆందోళన నిర్వహించింది. దీంతో కార్యాలయ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరసనలో పార్టీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. తమ అధినేత చంద్రబాబు ఇంటిపై వైసీపీ నాయకులు దాడి చేసిన ఘటనకు సంబంధించి మంగళగిరి డీజీపీ కార్యాలయంలో ఫిర్యాదు చేసేందుకు వచ్చారు. కాగా వారిని పోలీసులు అడ్డగించారు. అయితే పోలీసు అధికారులకు టీడీపీ నేతలకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
అయితే మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని డీజీపీ కార్యాలయంలోకి ఆహ్వానించిన పోలీసు అధికారులు టీడీపీ ఎమ్మెల్యేలను మాత్రం రోడ్డుపైనే అడ్డుకున్నారని వారు ఆరోపించారు. రామకృష్ణారెడ్డికి ఓ లెక్క.. మాకో లెక్కా.. అని భీష్మించారు. దీంతో భారీగా పోలీసు బలగాలు మోహరించి అడ్డుకున్నారు. చంద్రబాబు ఇంటిపై దాడి చేస్తామని 24 గంటల ముందు ట్విటర్, వాట్సాప్లో ఎమ్మెల్యే ప్రకటించి కర్రలు, రాళ్లు ఇనుపరాడ్లతో దాడి చేస్తే పోలీసులు ఇప్పటి వరకు ఆ ఎమ్మెల్యేపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు ఆరోపించారు.