న్యూఢిల్లీ : జీవనాధారమైన ఉద్యోగం చేస్తూనే ఇతర ఉద్యోగాలనూ చక్కబెట్టే మూన్లైటింగ్పై టెక్ కంపెనీల్లో హాట్ డిబేట్ సాగుతోంది. స్విగ్గీ వంటి కొన్ని కంపెనీలు మూన్లైటింగ్కు అనుకూలంగా ఉండగా దిగ్గజ టెక్ సంస్థలు ఈ పాలసీపై భగ్గుమంటున్నాయి. విప్రో సీఈఓ రిషద్ ప్రేమ్జీ మూన్లైటింగ్ను మోసగించడంగా అభివర్ణించగా తాజాగా టీసీఎస్ సీఓఓ గణపతి సుబ్రమణియన్ మూన్లైటింగ్ నైతికతకు సంబంధించిన అంశమని వ్యాఖ్యానించారు.
సుబ్రమణియన్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ మూన్లైటింగ్ నైతిక అంశమని, స్వల్పకాలిక ప్రయోజనాలకు మనం ఇటువంటి వాటిని అనుమతిస్తే దీర్ఘకాలంలో ఇది మనకు నష్టం చేకూరుస్తుందని హెచ్చరించారు. వ్యాపారం ఎన్నడూ కొన్ని పరిమితులకు లోబడి ఉంటుందని చెప్పారు. కరోనా మహమ్మారి వెంటాడిన సమయంలో 90 శాతం కంపెనీలు నియామకాలు చేపట్టలేదని గుర్తు చేశారు. టీసీఎస్ వంటి కొన్ని కంపెనీలే హైరింగ్ చేపట్టాయని అన్నారు. ఇక విప్రో సీఈఓ రిషద్ ప్రేమ్జీ మూన్లైటింగ్ మోసం చేయడమేనని వ్యాఖ్యానించారు.
ప్రైమరీ ఉద్యోగంతో పాటు అదనంగా పలు జాబ్లను చేయడాన్ని టెక్ కంపెనీలు మూన్లైటింగ్గా వ్యవహరిస్తున్నాయి. కంపెనీలు వర్క్ ఫ్రం హోం మోడ్లో ఉండగా ఉద్యోగులు ఇంటి నుంచే ఒకట్రెండు ఉద్యోగాలను చక్కబెడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రధాన ఉద్యోగానికి అదనంగా మరో సంస్ధలో పనిచేయడాన్ని భారత కంపెనీలు తీవ్రంగా పరిగణిస్తాయి. కంపెనీ పాలసీకి విరుద్ధంగా వ్యవహరించే అలాంటి ఉద్యోగులకు జరిమానా విధించడం లేదా విధుల నుంచి తొలగించడం జరుగుతుంది.