TCS on Work From Home | కరోనా మహమ్మారిని కట్టడి చేయడానికి ప్రపంచవ్యాప్తంగా వర్క్ ఫ్రం హోం కల్చర్ అమల్లోకి వచ్చి రెండేండ్లు దాటింది.. కరోనా నియంత్రణలోకి వచ్చిన తర్వాత కూడా ఐటీ సంస్థలన్నీ వర్క్ ఫ్రం హోం (డబ్ల్యూఎహ్హెచ్) కొనసాగించాయి. కానీ, వర్క్ ఫ్రం హోం సాకుగా ఐటీ నిపుణులు మూన్ లైటింగ్ (ఒక సంస్థతో కాంట్రాక్ట్ ఉద్యోగం చేస్తూ.. మరో సంస్థకు సేవలు) కు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. మూన్ లైటింగ్పై ఐటీ ఇండస్ట్రీలో పరస్పర భిన్నాభిప్రాయాలు ఉన్నా.. సంస్థలు కరుకుగానే వ్యవహరిస్తున్నాయి.
ఇప్పటికే విప్రో.. మూన్ లైటింగ్కు పాల్పడుతున్న 300 మందిని ఇంటికి సాగనంపింది. మరో ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ తమ సిబ్బందికి హెచ్చరికలు జారీ చేసింది. కానీ, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నది. వర్క్ ఫ్రం హోం పాలసీకి కొన్ని విధి విధానాలు తీసుకొచ్చింది. వర్క్ ఫ్రం హోం కోరుకుంటున్న సిబ్బంది మెడికల్ సర్టిఫికెట్ సమర్పించాలి.. ఆ సర్టిఫికెట్ను టీసీఎస్ పానెల్ డాక్టర్లు అప్రూవ్ చేయాలి.
మెడికల్ గ్రౌండ్స్లో ఇంటి నుంచి పని చేయాలని కోరుకుంటున్న వర్కర్ల దరఖాస్తులను యాజమాన్యం టీసీఎస్ ప్యానెల్ డాక్టర్ల అప్రూవల్కు పంపుతుంది. అటువంటి సంస్థ ప్యానెల్డ్ డాక్టర్ల ఆధ్వర్యంలో ఉద్యోగులు వైద్య పరీక్షలు, చికిత్స చేయించుకోవాలి. వారి నుంచి మెడికల్ సర్టిఫికెట్లు తీసుకుని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వారికి వర్క్ ఫ్రం హోం ఫెసిలిటీ కల్పించడం అవసరమేనని వైద్యులు అప్రూవ్ చేయాలి. అలా కాకుండా సాకులు చెబుతున్న సిబ్బంది పట్ల టీసీఎస్ యాజమాన్యం కఠినంగా వ్యవహరించనున్నది.
మెడికల్ సర్టిఫికెట్లు సబ్మిట్ చేసిన ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం విధానానికి అనుమతించినా.. బిజినెస్ క్లయింట్ల నుంచి పిలుపు వచ్చినా.. కంపెనీ అవసరాల కోసం రావాలని కోరితే తప్పనిసరిగా రావాల్సి రావచ్చు. ఆఫీసులకు వారానికి మూడు రోజులు రావాలనే షరతు విధించింది టీసీఎస్. తదనుగుణంగా సిబ్బంది అటెండెన్స్ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉంటున్నది.
` మా ఉద్యోగులను వారంలో కొన్ని రోజులు ఆఫీసులకు రావాలని ప్రోత్సహిస్తున్నాం. గణనీయ స్థాయిలో ఉద్యోగులు ఆఫీసులకు వచ్చేశారు` అని టీసీఎస్ పేర్కొంది. సంబంధిత మేనేజర్లు క్రియేట్ చేసిన రోస్టర్ ప్రకారం ఉద్యోగులు ఆఫీసులకు రావాలని గత నెల 22న మెసేజ్ పంపింది. వర్క్ ఫ్రం హోం పట్ల నిబంధనలు పాటించని ఉద్యోగులపై సీరియస్గా వ్యవహరించనున్నది.
మొత్తం సంస్థలో పని చేస్తున్న 6,16,171 మంది ఉద్యోగుల్లో మూడో వంతు మంది ఆఫీసులకు వస్తున్నారని టీసీఎస్ హెచ్ఆర్ ఆఫీసర్ మిలింద్ లక్కడ్ చెప్పారు. డిసెంబర్ నాటికి రోస్టర్ అటెండెన్స్ ప్రకారం సిబ్బంది అంతా ఆఫీసులకు వస్తారని భావిస్తున్నట్లు తెలిపారు. 70 శాతం సిబ్బందికి వందశాతం వేరియబుల్, 30 శాతం ఉద్యోగులకు బిజినెస్ యూనిట్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా వేతనాలు ఇస్తామని ఇంతకుముందే ప్రకటించింది.