ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చింది. మార్చి 31 తో ముగియనున్న 2020-21 ఆర్థిక సంవత్సరానికి గాను ఆదాయం పన్ను చెల్లింపులు, ఐటీ రిటర్నులతో ఆధార్ను జత చేశారా..? ఇతర డాక్యుమెంట్లు దాఖలు చేశారా? ఇంకా చేయనిపక్షంలో ఇప్పుడే ఆ పనిలో నిమగ్నమవ్వండి. ఇబ్బందులు లేకుండా చూసుకోండి అంటూ సూచిస్తున్నారు ఆదాయం పన్ను శాఖ అధికారులు. పన్ను ఆదా చేసే పెట్టుబడులు కాకుండా పన్ను చెల్లింపుదారులు జరిమానాలను నివారించడానికి పన్ను సంబంధిత పనులను కూడా పూర్తి చేయడం చాలా అవసరం అని గుర్తుంచుకోవాలి. ఏప్రిల్ 1-మార్చి 21 మధ్య ఆర్థిక సంవత్సరం కాలంలో ప్రజలు సంపాదించిన ఆదాయంపై పన్ను లెక్కిస్తారు. మార్చి 31 లోపు పన్ను చెల్లింపుదారులు చేయాల్సిన కొన్ని పనుల జాబితా మీ కోసం ఇక్కడ అందుబాటులో ఉంచాం. వీటిని చదివి ఆకలింపు చేసుకుని మార్చి నెలాఖరులోగా సంబంధిత డాక్యుమెంట్లను జత చేయడం ద్వారా జరిమానాలను నివారించుకునేందుకు వీలున్నది.
సవరించిన ఐటీఆర్ దాఖలు
సవరించిన ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) ను ప్రస్తుత 2020-21 ఆర్థిక సంవత్సరాంతంలోని మార్చి 31 న లేదా అంతకు ముందు ఎప్పుడైనా దాఖలు చేసుకోవచ్చు. గడువు తేదీ తర్వాత దాఖలు చేసిన ఏదైనా ఆదాయపు పన్ను రిటర్నులను ఆలస్యమైన రిటర్నులుగా పేర్కొంటారు. ఒకవేళ ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసిన తర్వాత.. దానిలో ఏవైనా మార్పులు చేయవలసి వస్తే పన్ను చెల్లింపుదారుడు సవరించిన రిటర్న్ను దాఖలు చేసుకునే వీలున్నది. సవరించిన ఐటీఆర్ను సమర్పించేందుకు గడువు కూడా మార్చి 31 అని గుర్తుంచుకోవాలి.
ముందస్తు పన్ను దాఖలు
ఆదాయపు పన్ను చట్టాల ప్రకారం.. ఒక వ్యక్తికి సంవత్సరానికి రూ.10,000 కంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉంటే.. ఆ వ్యక్తి నాలుగు వాయిదాల్లో ముందస్తు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి నాలుగో విడుత ముందస్తు పన్ను చెల్లించడానికి మార్చి 15 గడువు. 44ఏడీ, 44ఏడీఏ సెక్షన్ల క్రింద ఊహాజనిత పన్ను పథకం పరిధిలోకి వచ్చే వ్యక్తుల ముందస్తు పన్ను ఉంటుంది.
పాన్ను ఆధార్తో లింక్ చేయడం
పాన్ నంబర్ను ఆధార్తో తప్పకుండా అనుసంధానించాలి. ఇలా అనుసంధానించేందుకు గడువు కూడా మార్చి 31. ఇలా లింక చేయకపోతే విధించిన గడువు తర్వాత పాన్ కార్డ్ పనిచేయదు. బ్యాంకు అకౌంట్తో లింకై ఉన్న ఆధార్ నంబర్లోని పేరుతో పాన్ కార్డులోని పేరు ఇంటి పేరుతో సహా సరిపోలాలి. అలా లేనిపక్షంలో ఐటీఆర్ మొత్తం మీ బ్యాంక్ అకౌంట్లో జమ అవదు. మీ ఐటీ రిటర్నులు త్వరితగతిన రావాలంటే బ్యాంకు అకౌంట్, ఆధార్, పాన్ కార్డుల్లోని వినియోగదారుల పేర్లు అన్ని ఒకే మాదిరిగా ఉండాలి. అలా ఉంటేనే మీ ఫైల్ ముందుకు కదులుతుందని గుర్తించాలి.
వివాద్ సే విశ్వాస్
2020 మార్చి 17 న అమల్లోకి వచ్చిన ‘వివాద్ సే విశ్వాస్’ పథకం కింద సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (సీబీడీటీ) జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం డిక్లరేషన్ దాఖలు చేయడానికి గడువు మార్చి 31గా ఉన్నది. పెండింగ్లో ఉన్న ఆదాయపు పన్ను వ్యాజ్యాన్ని తగ్గించడం, ప్రభుత్వానికి సకాలంలో ఆదాయాన్ని సంపాదించడంతోపాటు పన్ను చెల్లింపుదారులకు ప్రయోజనం చేకూర్చడం ఈ పథకం యొక్క లక్ష్యం. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని మార్చి 31 లో మీ ఐటీఆర్ను సమర్పించేలా చూసుకోవడం ద్వారా అటు మీరు, ఇటు ప్రభుత్వానికి కూడా లాభం చేకూరుతుంది.