న్యూఢిల్లీ, ఆగస్టు 14: కరోనా మహమ్మారి బారినపడి కుటుంబసభ్యులను కోల్పోయిన వారి బతుకులు ఆగమాగం అయ్యాయి. పరిహారం చెల్లించి వారిని ఆదుకోవాల్సిన కేంద్రం పట్టనట్టు వ్యవహరించింది. దీంతో ఆప్తులను బంధువులు, వారు పనిచేసే సంస్థలు ఆర్థికంగా ఆదుకుంటే.. ఆ డబ్బు మీద కూడా కేంద్రం కన్నేసింది. ఆ మొత్తాన్ని కూడా ఆదాయపన్ను పరిధిలోకి తీసుకురావాలని చూస్తున్నది. అసలే ఆప్తులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉంటే కనీసం ఇలాగైనా ప్రశాంతంగా బతకకుండా చేస్తున్నది. కరోనా కారణంగా చనిపోయిన వారి కుటుంబసభ్యులు అందుకున్న ఆర్థిక సాయం, పరిహారాన్ని ఆదాయం కింద పరిగణిస్తామని ఆదాయ పన్ను శాఖ తెలిపింది.
ఆ ఆదాయాన్ని ఎలా చూపించాలనే దానిపై ఐటీ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కరోనా బారిన పడిన వారికి, వారి కుటుంబసభ్యులకు.. వారి స్నేహితులు, బంధువులు చాలామంది ఆర్థిక సాయం చేశారు. ఈ ఆర్థిక సాయం వివరాలు కూడా బహిర్గతం చేయాలని ఐటీ శాఖ సూచించింది. ఇప్పటికే ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే గడువు ముగిసినందున, యజమానులు లేదా బంధువుల నుంచి ఆర్థిక సాయం లేదా పరిహారం పొందిన వారు ఫారం-ఏ దాఖలు చేయాలని పేర్కొంది.
అయితే ఈ మొత్తానికి ఎలాంటి పన్ను ఉండదని స్పష్టం చేస్తూనే.. రూ.10 లక్షలు దాటితే పన్ను చెల్లించాల్సి వస్తుందని పేర్కొన్నది. ఎవరైనా వ్యక్తి కరోనా కారణంగా చనిపోయిన ఆరు నెలల్లోపు ఆ మొత్తం అందుకున్న వారికి ఇది నిబంధనలు వర్తిస్తాయని తెలిపింది. కరోనా సంబంధ చికిత్స కోసం అందుకున్న డబ్బు లేదా చనిపోయిన వారి కుటుంబసభ్యులకు అందిన డబ్బు ఈ క్యాటగిరీలోకి వస్తుందని చెప్పింది. 2022 డిసెంబర్ 31వ తేదీ లేదా ఆర్థిక సంవత్సరం ముగియడానికి 9 నెలల ముందు ఆ మొత్తం అందుకుని ఉండాలని వెల్లడించింది.