Fire in Tata Nexson | భారత్ మార్కెట్లో ఎలక్ట్రిక్ కార్ల రంగం శైశవదశలోనే ఉన్నది. ఇప్పుడిప్పుడే విస్తరణ దిశగా అడుగులేస్తున్నది. ఇంతకుముందు వివిధ కంపెనీలు తయారు చేసిన ఎలక్ట్రిక్ టూ వీలర్స్లో మంటలు రావడం అందరినీ ఆందోళనకు గురి చేసింది. కానీ.. తాజాగా ముంబైలో బుధవారం సాయంత్రం టాటా మోటార్స్ తయారు చేసిన నెక్సాన్ ఈవీ కారులో మంటలొచ్చాయి. ఒక ఎలక్ట్రిక్ కారులో మంటలు రావడం ఇదే తొలిసారి. దీనిపై టాటా మోటార్స్ రియాక్టయింది. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేప్తామని ప్రకటించింది. అన్ని విధాల భద్రతకు కట్టుబడి ఉన్నట్లు తెలిపింది. ఈ ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేపట్టినట్లు.. ఈ ప్రమాదానికి కారణాలు తెలియాల్సి ఉందని టాటా మోటార్స్ అధికార ప్రతినిధి తెలిపారు. గమ్మత్తేమిటంటే టాటా మోటార్స్లోనే కాదు.. భారత్ ఎలక్ట్రిక్ కార్ల మార్కెట్లోనే బెస్ట్ సెల్లింగ్ వేరియంట్గా టాటా నెక్సాన్ ఈవీ నిలిచింది.
2020 జనవరిలో టాటా నెక్సాన్ ఈవీ.. భారత్ మార్కెట్లోకి వచ్చింది. పూర్తిగా దర్యాప్తు జరిగిన తర్వాత ప్రమాద కారణాలు తెలియచేస్తాం. మా కస్టమర్ల భద్రతకు కట్టుబడి ఉన్నాం. 30 వేలకు పైగా ఎలక్ట్రిక్ వెహికల్స్ మార్కెట్లో 100 మిలియన్ల కి.మీ. దూరం ప్రయాణించిన తర్వాత జరిగిన తొలి ప్రమాదం ఇది అని టాటా మోటార్స్ అధికార ప్రతినిధి తెలిపారు.
ఎలక్ట్రిక్ మొబిలిటీని ప్రోత్సహించేందుకు కేంద్రం చేపట్టిన చర్యల్లో భాగస్వామి కావడానికి టాటా మోటార్స్ ఈవీ అనుబంధ టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఈవీ వాహనాలను తయారు చేసేందుకు దూకుడుగా ప్లాన్లు వేస్తున్నది. టాటా నెక్సాన్ ఈవీతోపాటు టాటా టైగోర్, ఇతర ఈవీ వాహనాలను విపణిలోకి తెచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నది.