ముంబై : భారత మార్కెట్లో న్యూ టాటా పంచ్ను ఈనెల 20న లాంఛ్ చేస్తున్నట్టు టాటా మోటార్స్ వెల్లడించింది. అక్టోబర్ 4 నుంచి టాటా పంచ్ ప్రీ బుకింగ్స్ను అధికారికంగా ప్రారంభించింది. సింగిల్ పెట్రోల్ ఇంజన్తో అందుబాటులో ఉండే న్యూ టాటా పంచ్ ధరల శ్రేణి రూ 5 లక్షల నుంచి రూ 10 లక్షల మధ్య (ఎక్స్ షోరూం) ఉంటుందని కంపెనీ పేర్కొంది. నాలుగు వేరియంట్లు ఏడు రంగుల్లో టాటా పంచ్ లభించనుంది.
ఆల్ఫా-ఏఆర్సీపై అభివృద్ధి చేసిన తొలి ఎస్యూవీగా ఆల్న్యూ టాటా పంచ్ కస్టమర్ల ముందుకు రానుంది. ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, ఎల్ఈడీ డేటైం రన్నింగ్ లైట్స్, సిగ్నేచర్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, 16 ఇంచ్ డైమండ్ కట్ అలాయ్ వీల్స్ వంటి ఎక్స్టీరియర్స్తో న్యూ టాటా పంచ్ ఆకట్టుకోనుంది.
ఇక అత్యాధునిక ఇంటీరియర్స్తో రూపొందిన న్యూ టాటా పంచ్ మారుతి సుజుకి ఇగ్నిస్, రెనాల్ట్ కైగర్, నిస్సాన్ మాగ్నైట్, హ్యుండాయ్కాస్పర్, సిట్రియన్ సీ3 వంటి వాహనాలకు దీటైన పోటీ ఇస్తుందని భావిస్తున్నారు. న్యూ టాటా పంచ్ వైట్, ఆరెంజ్, డెటొనా గ్రే, మెటర్ బ్రౌన్, కలిప్సో రెడ్, ట్రాపికల్ మిస్ట్, టార్నెడో బ్లూ వంటి ఏడు రంగుల్లో లభిస్తుంది. రూ 21,000తో టాటా పంచ్ ముందస్తు బుకింగ్స్ ఓపెన్ అయ్యాయని కంపెనీ పేర్కొంది.