న్యూఢిల్లీ: కరోనాను నియంత్రించడానికి గతేడాది కేంద్రం విధించిన లాక్డౌన్ ఆటోమొబైల్ రంగాన్ని కకావికలం చేసింది. వాణిజ్యయుద్ధం పుణ్యమా? అని అంతకుముందే కార్ల విక్రయాలు తగ్గిపోయాయి. ఇక కరోనాతో దాదాపు గతేడాది తొలి అర్ధభాగం వరకూ వాహనాల విక్రయాల ఊసే లేదు.. లాక్డౌన్ ఆంక్షలు క్రమంగా ఎత్తేసిన తర్వాత.. నెమ్మదిగా ప్యాసింజర్ వెహికల్స్, వ్యక్తిగత మొబిలిటీ సేల్స్ పెరిగాయి.. కానీ 2018 నాటి పీక్ స్థాయికి కార్లు, బైక్స్, స్కూటర్ల విక్రయాలు చేరుకోలేదు.
ప్యాసింజర్ వాహనాల విక్రయాల్లో గణనీయ పురోగతి కనిపిస్తున్నా టూ వీలర్స్, కమర్షియల్ వాహనాల విక్రయాలు ఐదేండ్ల నుంచి 10 ఏండ్ల కనిష్ఠ స్థాయికి పడిపోవడం ఆటో ఇండస్ట్రీని కలవర పరుస్తున్నది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ భారీగా తగ్గిపోవడంతో వాణిజ్య వాహనాల విక్రయాలు దశాబ్దాల క్రితం స్థాయికి పడిపోవడం ఆందోళన కలిగిస్తున్నది.
ఈ నేపథ్యంలో టాటా మోటార్స్.. దాని అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్.. హోండా మోటార్.. అశోక్ లేలాండ్.. మహీంద్రా అండ్ మహీంద్రా తదితర దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాలు పొదుపు చర్యలు వేగవంతం చేశాయి. డబ్బు ఆదా చేసుకునేందుకు వివిధ రకాల పద్దతులు అవలంభిస్తున్నాయి ఆటోమొబైల్ జెయింట్లు.. ప్రత్యేకించి వర్క్ఫోర్స్ తగ్గించడానికి తప్పనిసరి అవసరమైన చర్యలన్నీ చేపట్టాయి.
లాభదాయకం కాని యూనిట్లను మూసివేయడంతోపాటు మేనేజ్మెంట్ స్థాయి నుంచి వర్కర్ల స్థాయి వరకు మొత్తం సెటప్ను పునర్వ్యవస్థీకరిస్తున్నాయి. ఈ ప్రక్రియకు ఆటో దిగ్గజాలు ముద్దుగా ‘రైట్సైజింగ్’ అనే పేరు పెట్టాయి. కరోనా మహమ్మారి ప్రభావం మరికొంత కాలం కొనసాగే పరిస్థితులు ఉన్నందున.. సిబ్బంది తగ్గింపునకు చర్యలు చేపట్టాయి.
భవిష్యత్ పరిణామాలను గమనించిన హోండా మోటార్స్, టాటా మోటార్స్, జనరల్ మోటార్స్ ఇండియా, అశోక్ లేలాండ్, అపోలో టైర్స్ సంస్థల్లో సుమారు 5,000 మంది స్వచ్ఛంద పదవీవిరమణ చేశారని సమాచారం. పలు ఆటోమొబైల్ సంస్థలు సిబ్బంది వేతనాలు తగ్గించేసి.. బోనస్లు పక్కనబెట్టేయడం వంటి చర్యలు చేపట్టాయి.
ఇప్పటికే మహీంద్రా అండ్ మహీంద్రా (ఎం అండ్ ఎం), టాటా మోటార్స్, మారుతి సుజుకి తమ ఆర్గనైజేషన్ స్రక్చర్ను పునర్వ్యవస్థీకరించేశాయి. ఇందులో భాగంగా టాటా మోటార్స్ తన పర్మినెంట్ స్టాఫ్, వర్కర్లను వీఆర్ఎస్ కింద గత డిసెంబర్లోనే ఇంటికి పంపేసింది. దాని అనుబంధ జాగ్వార్ లాండ్ రోవర్ వచ్చే ఆర్థిక సంవత్సరంలో 2000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించేయాలని నిర్ణయించుకున్నది.
ఏప్రిల్ రెండో తేదీన మహీంద్రా అండ్ మహీంద్రా మేనేజింగ్ డైరెక్టర్ అండ్ సీఈవోగా బాధ్యతలు చేపట్టనున్న అనీశ్ షా స్పందిస్తూ.. తమ సంస్థల్లో జాబ్ రొటేషన్ల నుంచి.. కొన్ని విభాగాల మూసివేత వంటి నిర్ణయాలు తీసుకున్నామని.. అవి అమలులోకి రానున్నాయన్నారు. వ్యక్తిగత ప్రయోజనాల పేరిట మహీంద్రా మొబిలిటీ సర్వీసెస్ సెక్టార్ ప్రెసిడెంట్ పార్థసారధి తన పదవికి రాజీనామా చేశారు.
గ్రేటర్ నోయిడా ప్లాంట్లో ఉత్పత్తిని నిలిపివేస్తున్నట్లు హోండా కార్స్ ఇండియా గత డిసెంబర్లోనే ప్రకటించేసింది. వాణిజ్య వాహనాల తయారీ సంస్థ అశోక్లేలాండ్ తమ సంస్థలోని ఆఫీసులు, ఫ్యాక్టరీల్లోని పర్మినెంట్ ఎంప్లాయిస్కు వీఆర్ఎస్ ఇస్తున్నట్లు గత నవంబర్లో వెల్లడించింది.