Tata Approaches CCI | టాటా సన్స్ అనుబంధ ఎయిరిండియా బుధవారం యాంటీ ట్రస్ట్ రెగ్యులేటరీ సంస్థ కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ను సంప్రదించింది. దేశంలోనే లో కాస్ట్ విమానయాన సంస్థ ఎయిర్ ఏషియా ఇండియాను విలీనం చేసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై మహరాజా (ఎయిరిండియా) ప్రతినిధులు సీసీఐని కలిసినట్లు తెలుస్తున్నది. ఎయిర్ఏషియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లోని పూర్తి వాటాను చేజిక్కించుకోవాలని ఎయిరిండియా ప్రతిపాదన.
ఎయిర్ ఏషియా ఇండియా సంస్థ పరోక్షంగా పూర్తిగా టాటా సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ (టీఎస్పీఎల్) అనుబంధ సంస్థ. ఎయిర్ ఏషియా ఇండియాలో టీఎస్పీఎల్కు 83.67 శాతం వాటా ఉంది. ఈ మేరకు ఎయిరిండియాలో ఎయిర్ ఏషియా ఇండియా విలీనం కోసం నోటీసు ఇచ్చినట్లు మహరాజా వర్గాలు చెప్పాయి. ఈ రెండు సంస్థలకు దేశీయ విమానయాన మార్కెట్లో 15.7 శాతం వాటా ఉంటుంది. ఎయిరిండియా అనుబంధ ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ సంస్థ జాతీయ విమాన సర్వీసులను నడుపదు. ఎయిరిండియా ఎక్స్ప్రెస్ కేవలం భారత్-గల్ఫ్ దేశాల రూట్ల మధ్యే సర్వీసులు నిర్వహిస్తుంది.
మహరాజా (ఎయిరిండియా) టేకోవర్ బిడ్ గెలుచుకోవాలంటే టాటా సన్స్కు ఏదేనీ విమానయాన సంస్థలో మెజారిటీ వాటా కలిగి ఉండాలి. అందుకోసం 2020 డిసెంబర్లోనే ఎయిర్ ఏషియా ఇండియాలో తన వాటాను 83.67 శాతాన్ని పెంచింది. మిగతా 16 శాతాన్ని ఎయిర్ఏషియా బెర్హద్ వద్ద నుంచి ఈ నెలాఖరులోగా టాటా సన్స్ చేజిక్కుంచుకుందామని ప్రణాళికలు రచించింది.
ఇక టాటా సన్స్ అనుబంధ సంస్థ విస్తారా ఎయిర్లైన్స్ను ఎయిరిండియాతో అనుసంధానించడానికి చాలా టైం పడుతుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 49 శాతం వాటా గల సింగపూర్ ఎయిర్లైన్స్తో సంప్రదింపులు ఇంకా కొనసాగుతున్నాయి. గత జనవరిలో కేంద్ర ప్రభుత్వం నుంచి ఎయిరిండియా మేనేజ్మెంట్ బాధ్యతలు టేకోవర్ చేసిన టాటా సన్స్.. తన ఆధీనంలోని అన్ని విమాన యాన సంస్థలను ఒక గొడుగు కిందకు తెచ్చేందుకు కసరత్తు చేస్తున్నది.